ఆరేళ్ల బాలికపై రేప్... నిందితుడి ఊహా చిత్రాలివే... కొనసాగుతున్న పోలీస్ వేట...
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. హపూర్ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా పోలీసులు ఇప్పటికీ నిందితుల కోసం గాలిస్తూనే ఉన్నారు.బాలిక తల్లిదండ్రులు,ఆమె చుట్టుపక్కలవారు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడికి సంబంధించి మూడు ఊహా చిత్రాలను విడుదల చేశారు.
ఢిల్లీకి 100కి.మీ దూరంలోని ముక్తేశ్వర్ కాలనీలో ఆ బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో.. బైక్పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా... మరుసటి రోజు ఉదయం గ్రామానికి సమీపంలోని ఓ చెట్ల పొదల్లో ఆమెను గుర్తించారు. రక్తపు మడుగులో,అపస్మారక స్థితిలో పడి వున్న బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా... ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్దారించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను మీరట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు... అయితే ప్రమాదం నుంచి బయటపడ్డట్టేనని చెప్పలేమన్నారు. బాలికకు పలు సర్జరీలు చేయాల్సి వస్తుందని... సుదీర్ఘ చికిత్స అవసరమని చెప్పారు. బాలిక పరిస్థితి కారణంగా ఇప్పటివరకూ ఆమె వాంగ్మూలం నమోదు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని... త్వరలోనే అతన్ని పట్టుకుంటామని హపూర్ పోలీసులు తెలిపారు.మరోవైపు ఎస్పీ,కాంగ్రెస్ పార్టీలు ఈ ఘటనను వ్యతిరేకిస్తూ జిల్లా పోలీస్ చీఫ్ కార్యాలయం వద్ద నిరసనలకు ప్లాన్ చేశాయి.
ఉత్తరప్రదేశ్లో నేరాలు పెరిగిపోవడం,గూండాగిరీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన క్రైమ్స్-2018 వివరాల ప్రకారం... దేశంలోనే మహిళలపై దాడులు,హింసలో ఉత్తరప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. 2018లో దేశవ్యాప్తంగా మహిళల పట్ల జరిగిన నేరాలపై 3,78,277 కేసులు నమోదవగా... ఇందులో 59,445 కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే నమోదవడం గమనార్హం.