2015-18 మధ్య ఎక్కువగా ఎవరిని దత్తత తీసుకున్నారో తెలుసా..?
లింగ నిష్పత్తిలో భారత్ గణాంకాలు తప్పై ఉండచ్చేమో కానీ దత్తత విషయానికొస్తే అమ్మాయిలనే చాలామంది దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మనదేశంలోనే కాదు ప్రపంచదేశాల్లో కూడా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. వీరిలో మగపిల్లల కంటే ఆడపిల్లలనే ఎక్కువగా దత్తత తీసుకుంటున్నారు.
2015-18 మధ్య చాలామంది పిల్లలను దత్తత తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం 11,649 మంది పిల్లలను దత్తత తీసుకోగా... అందులో 6,962 మంది ఆడపిల్లలు, 4,687 మంది మగపిల్లలుగా ఉన్నారు. 2015-16 సంవత్సరంలో 3011 మంది పిల్లలు దత్తత తీసుకోగా.. అందులో 1855 మంది ఆడపిల్లలు ఉండటం విశేషం. 2016-17 విషయానికొస్తే 3210 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. అందులో 1915 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఇక 2017-18 గణాంకాలు పరిశీలిస్తే 3,276 మంది పిల్లలు దత్తత తీసుకోగా అందులో 1943 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఇక ఈ గణాంకాలన్నిటినీ కలిపితే దత్తత తీసుకోబడ్డ వారిలో 60శాతం అమ్మాయిలే ఉన్నారు. ఇక ఒక దేశం నుంచి మరో దేశం మధ్య జరిగిన దత్తత కార్యక్రమంలో 69 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు.
ఇక ఈ సమాచారం మొత్తాన్ని కేంద్ర మహిళా శిశుసంక్షేమాభివృద్ధి శాఖ వెల్లడించిది. ఫిబ్రవరి 8న లోక్సభలో ఈ గణాంకాలను ఉంచింది. తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్, ఎల్ఆర్ శివరామ్ గౌడ, అంజుబాలలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం ఈ లెక్కలను లోక్సభకు తెలిపింది. అయితే అమ్మాయిలను ఎక్కువ మంది దత్తత తీసుకున్నారని వెలువడిన గణాంకాలపై కాస్త అనుమానం ఉన్నప్పటికీ... అమ్మాయిలను చిన్న చూపు చూసే ధోరణి మాత్రం తగ్గిందని అన్నారు సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ సభ్యుడు ప్రజాక్త కుల్కర్ణి.
ఇదిలా ఉంటే మరింత మంది అమ్మాయిలను దత్తత తీసుకునేందుకు చాలామంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు కర్నాటక రాష్ట్ర శిశు సంక్షేమ అధికారిణి సింధునాయక్. పట్టణ ప్రాంతాల్లో నివాసముంటున్న మధ్యతరగతి వారికి అమ్మాయిల పట్ల అవగాహన ఉండటంతో చాలామంది వారిని దత్తత తీసుకుంటున్నారని.. అదే గ్రామీణప్రాంతాలు చిన్న టౌన్లలో మాత్రం అబ్బాయిలనే దత్తత తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని వెల్లడించారు.