ఆత్మహత్య చేసుకుంటాం: 60మంది దళిత విద్యార్థులు
పాట్నా: దళిత విద్యార్థులకు ఉపకారవేతనం పథకం కింద ప్రభుత్వం తమకు అందించాల్సిన ఉపకారవేతనం ఆపేసిందని బీహార్కు చెందిన 60మంది దళిత విద్యార్థులు తెలిపారు. ఉపకార వేతనాలు అందని కారణంగా తామంతా ఆత్మహత్య చేసుకుంటామని, తమకు మరో దారిలేదని తేల్చి చెప్పారు.
వివరాల్లోకెళితే.. ఒరిస్సా భువనేశ్వర్లోని రాజధాని ఇంజినీరింగ్ కళాశాలలో బీహార్కు చెందిన 60మంది దళిత విద్యార్థులు రెండేళ్ల నుంచి చదువుకుంటున్నారు. విద్యార్థులు అక్కడ చేరిన 6నెలల తర్వాత బీహార్ ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన ఉపకారవేతనాలను నిలిపివేసింది. దీంతో ఆ కళాశాల యాజమాన్యం బీహార్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విషయం చెప్పినా అక్కడి నుంచి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం విద్యార్థులను తరగతులకు హాజరు కావద్దని ఆదేశించింది. ఫీజులు చెల్లించాకే తరగతులకు రావాలని ప్రిన్సిపల్ చెప్పినట్లు గజేంద్ర అనే బాధిత విద్యార్థి ఒకరు వాపోయాడు. ఆందోళన చెందిన విద్యార్థులు ప్రభుత్వం తమకు ఉపకారవేతనాలు చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరించారు.
దీనిపై స్పందించిన బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్.. విద్యార్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలా దళిత విద్యార్థులను ఆదుకుంటుందని హామీనిచ్చారు.
ఈ విషయమై బీహార్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి సంతోశ్ నిరాలా మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల బ్యాంకు ఖాతా నంబర్లలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటాయని తెలిపారు. జనవరి 22నే విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరయ్యాయని తెలిపారు. కాగా, ప్రతిపక్ష బిజెపి నేతలు ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం దళిత విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే ఆ విద్యార్థులకు ఉపకారవేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.