మూడ్ ఆఫ్ ది నేషన్: నరేంద్ర మోడీకి మరో ఛాన్స్ ఇవ్వాల్సిందే, 2019లో బీజేపీయే!
న్యూఢిల్లీ: ఇటీవల పలు ప్రీపోల్ సర్వేలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయేకు 2014 కంటే తక్కువ సీట్లు వస్తాయని, కానీ మళ్లీ నరేంద్ర మోడీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి. గతంలో కంటే సీట్లు మాత్రం బాగా తగ్గుతాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి మరో ఊరట కలిగించే అంశం.
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?
నరేంద్ర మోడీకి మరో ఛాన్స్
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇటీవల చేసిన సర్వే గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 60 శాతం భారతీయులు మోడీకి మరోసారి అధికారం ఇచ్చి చూడాలని భావిస్తున్నారని తేలింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. యూపీఏ పదేళ్ల హయంలో భారీ అవినీతి జరిగిందని, వారే రెండుసార్లు పాలించారని, అలాంటిది అవినీతి మచ్చలేకుండా, దేశ భవిష్యత్తు కోసం మంచి సంస్కరణలు చేపడుతున్న మోడీకి మరోసారి ఛాన్స్ ఇవ్వాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారట. ఈ అభిప్రాయానికి తోడు ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు బీజేపీకి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో బీజేపీ మరోసారి గట్టెక్కవచ్చునని చెబుతున్నారు.
60 శాతం మంది బీజేపీకే
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్న వారిలో అరవై శాతం మంది మోడీకి మరో ఛాన్స్ ఇవ్వాలని, 32 శాతం మంది మాత్రమే ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పగా, ఎనిమిది శాతం మంది మాత్రం చెప్పలేమని అన్నారు. ఈ సర్వేలో 2014 కంటే ఎన్డీయేకు దాదాపు వంద సీట్లు తక్కువగా వస్తాయని తేలిన విషయం తెలిసిందే. దాదాపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 240 సీట్ల వరకు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 166 సీట్లు వస్తాయని తేలింది.
ఉత్తరాదిన బీజేపీదే హవా
ఎన్నికలు జరిగితే బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ ఉత్తరాదిన ఇప్పటికీ ఆ పార్టీదే హవా అని ఈ సర్వేలో తేలింది. 40 శాతం ఓట్లు ఎన్డీయే కూటమికి పడనున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కలిసి నలభై శాతం ఓట్లు రానున్నాయి. యూపీఏకు 23 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు రానున్నాయి. ఉత్తరాది నుంచి ఎన్డీయేకు 66 సీట్లు, యూపీఏకు 20 సీట్లు రానున్నాయి. దక్షిణాదిలో మాత్రం యూపీఏ, ఇతరులతే హవా. బీజేపీకి కేవలం 18 శాతం ఓట్ షేర్ ఉంది. యూపీఏకు 43 శాతం, ఇతరులకు 39 శాతం రానుంది. దక్షిణాదిన యూపీఏకు 78 సీట్లు రానున్నాయి. వెస్టర్న్ భారత్ (గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) లోను యూపీఏ కంటే ఎన్డీయేకే ఎక్కువ అవకాశముంది.