మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా: మహమ్మారి బారిన 60శాతం మంది మంత్రులు
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు 60 శాతం మంది మంత్రులు కరోనా బారినపడటం గమనార్హం.
గత ఏడాది కరోనావైరస్ వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలోని 43 మంత్రుల్లో 26 మందికి కరోనా సోకింది. ఇటీవల కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో గత వారం రోజుల్లోనే ఐదుగురు మంత్రులు కరోనా బారినపడ్డారు.
ఛాగన్ భుజ్బల్ తోపాటు వాటర్ రిసోర్స్ మినిష్టర్ జయంత్ పాటిల్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిష్ట్రేషన్ మినిష్టర్ డా. రాజేంద్ర సింఘ్నే, ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపేలకు కరోనా సోకింది. కాగా, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఓంప్రకాశ్ అలియాస్ బచ్చు కదు రెండోసారి కరోనా బారినపడ్డారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువగా ఎన్సీపీ మంత్రులే కరోనా బారినపడ్డారు. మొత్తం 16 మంది మంత్రుల్లో 13 మంది మంత్రులకు కరోనా సోకింది. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు మంత్రులకు, శివసేన నుంచి ఐదుగురు మంత్రులకు, ఒక స్వతంత్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్, హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, హౌసింగ్ మినిష్టర్ జితేంద్ర అవ్హద్, సోషల్ జష్టిస్ మినిష్టర్ ధనంజయ్ ముండే, లేబర్ మినిష్టర్ దిలీప్ వాల్సే పాటిల్, ఎఫ్డీఏ మినిష్టర్ రాజేంద్ర సింఘ్నే, రూరల్ డెవలప్మెంట్ మినిష్టర్ హసన్ ముష్రీఫ్, కో-ఆపరేటివ్స్ మినిస్టర్ బాలాసాహెబ్ పాటిల్, ఎంఓఎస్ సంజయ్ బాన్సోడే, ప్రజక్త్ తన్పూర్ లు కరోనా బారినపడినవారిలో ఉన్నారు.
కాంగ్రెస్ మంత్రులు అశోక్ చవాన్ (పీడబ్ల్యుడీ), నితిన్ రౌత్ (ఎనర్జీ) అస్లాం షేక్ (టెక్స్టైల్స్), వర్షా గైక్వాడ్ (పాఠశాల విద్య, సునీల్ కేదార్ (క్రీడలు, యువజన వ్యవహారాలు), మోస్ విశ్వజీత్ కదమ్, సతేజ్ పాటిల్ లకు కరోనా బారినపడ్డారు.
శివసేన నుంచి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే, రవాణా మంత్రి అనిల్ పరాబ్, వ్యవసాయ మంత్రి దాదా భూసే, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్, మోస్ రెవెన్యూ అబ్దుల్ సత్తార్ వైరస్ బారిన పడ్డారు.
వరుసగా మూడు రోజులు నుంచి ప్రతి రోజు 6,000 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో సోమవారం 5,210 తాజా కేసులు నమోదయ్యాయి. ముంబైలో, వరుసగా రెండు రోజులు 900 తాజా కేసులను నివేదించిన తరువాత ఒకే రోజు అంటువ్యాధుల సంఖ్య 760కి పడిపోయింది. ఫిబ్రవరి 8 నుంచి ముంబైలో క్రియాశీల కోవిడ్ -19 కేసులలో 36.38 శాతం పెరుగుదల నమోదైంది.