యువతితో యువకుడు పరారీ: తల్లి బట్టలూడదీసి, కారం చల్లి నరకం చూపారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు, తను ప్రేమించిన అమ్మాయితో లేచిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువతి తల్లిదండ్రులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా యువకుడి తల్లిని బజారుకీడ్చి బట్టలూడదీశారు. తీవ్రంగా కొట్టి కారంపొడి చల్లారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యూపీలోని లఖింపూర్ ఖేరీలో ప్రేమించుకున్న ఇద్దరు యువతీయువకులు ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయారు. దీంతో యువతి తరుపు కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడికి దిగారు.
60 ఏళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతోపాటు బట్టలూడదీశారు. అనంతరం ముఖంపై, చెప్పరాని చోట్ల కారంపోసి కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిదిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయలేదు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ దుశ్చర్యను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితులు పరారీలో ఉండగా, వీరిలో నలుగురు మహిళలే కావడం గమనార్హం.