శబరిమలలో కలకలం రేపుతున్న కరోనా కేసులు... 61 మంది పోలీసులకు పాజిటివ్...
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో కరోనా అలజడి రేపుతోంది. శబరిమల తీర్థయాత్ర ప్రారంభమై దాదాపు 25 రోజులు పూర్తి కావస్తుండగా.. ఇప్పటివరకు అక్కడ 183 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 75శాతం మంది అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందే కావడం గమనార్హం.
శబరిమలలో కరోనా పరిస్థితులపై ఇటీవల శబరిమల మకరవిలక్కు-2020 పేరుతో అక్కడి అధికారులు రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఓ నివేదిక సమర్పించారు. దాని ప్రకారం... గత కొద్దిరోజులుగా అక్కడ కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 మధ్యలో దాదాపు 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 16,205 మందికి కరోనా టెస్టులు చేయగా... ఇందులో 13,625 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు.
అయ్యప్ప భక్తుల్లో ఇప్పటివరకూ కేవలం 47 మంది మాత్రమే కరోనా బారినపడ్డారు. అదే సమయంలో శబరిమలలో విధులు నిర్వహిస్తున్న 2573 మంది సిబ్బందిలో 5.6శాతం కరోనా పాజిటివ్ రేటుతో 136 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా పోలీస్ సిబ్బంది 61 మంది ఉండటం గమనార్హం. పంబా వద్ద విధులు నిర్వహిస్తున్న 47 మంది పోలీసులు,సన్నిధానం వద్ద విధులు నిర్వహిస్తున్న 11 మంది,నీలక్కల్ వద్ద విధులు నిర్వహిస్తున్నవారిలో ముగ్గురు పోలీసులు కరోనా బారినపడ్డారు.
ఇప్పటివరకూ ఒకే ఒక్క వైద్యాధికారి మాత్రమే శబరిమలలో కరోనా బారినపడ్డారు. రాబోయే రోజుల్లో శబరిమలలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రిపోర్టులో పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.జోసెఫ్ ఈ రిపోర్టుపై స్పందిస్తూ... దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా కారణంగా దాదాపు 7 నెలల పాటు మూతపడ్డ శబరిమల ఆలయం నవంబర్ 15న తెరుచుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 26 వరకు శబరిమలలో మండల పూజలు జరగనున్నాయి. డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, జనవరి 14న మకరవిలక్కు పూజలు నిర్వహిస్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించి ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.