ఇదీ ప్రభుత్వం అంటే!: మావోలకు భారీ దెబ్బ, పెద్ద ఎత్తున లొంగిపోయిన నక్సల్స్
నయారాయపూర్: చత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో ఒకేసారి 62 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 51 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో పాటు లొంగిపోయారు. ఇది అతిపెద్ద అచీవ్మెంట్ అని ప్రభుత్వం పేర్కొంది.
త్వరలో చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్లతో పాటు ఇక్కడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికలు పెద్ద సవాల్. చత్తీస్గఢ్లో ఎక్కువ ప్రాంతం అటవీ ప్రాంతం. పైగా మావోయిస్టుల కదలికలు అన్ని రాష్ట్రాలలో కంటే ఎక్కువ. ఇలాంటి చోట్ల ఎన్నికలు పెద్ద సవాల్.
ఎన్నికలకు ముందు పెద్ద దెబ్బ
ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం. ఇంతమంది మావోల లొంగుబాటు వామపక్ష తీవ్రవాదానికి పెద్ద దెబ్బ అని చెబుతున్నారు. యాభై ఒక్క మంది మావోయిస్టులు దేశీ ఆయుధాలతో లొంగిపోయారు. వారు బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ వివేకానంద్ సిన్హా, నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర శుక్లాల ఎదుట లొంగిపోయారు.
వరుస ఘటనలు
లొంగిపోయిన నక్సలైట్లు మావోయిస్టుల్లోని కుతుల్ ఏరియా కమిటీలో పని చేసినట్లుగా పోలీసులు తెలిపారు. గత అయిదేళ్లుగా మావోయిస్టుల పట్ల రాష్ట్ర ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. వారి దాడిలో పలువురు సామాన్యులు గాయపడుతున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ వరకు దాదాపు 43 మంది చనిపోయారు. అక్టోబర్ 30వ తేదీన దంతెవాడ జిల్లాలో దూరదర్శన్ కెమెరామెన్, మరో ముగ్గురు పోలీసుల మృతికి మావోయిస్టులే కారణం.
సంతోషమని రాజ్నాథ్ సింగ్ ట్వీట్
కాగా, బీజేపీ ప్రభుత్వం హయాంలో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. చత్తీస్గఢ్లో ఆయుధాలతో సహా పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషకరమని ట్వీట్ చేశారు. ఇందుకు తాను రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని, డీజీపీని, పోలీసులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
ఇదీ ప్రభుత్వం సత్తా
ఇంతమంది నక్సలైట్లు లొంగిపోవడాన్ని బట్టి రమణ్ సింగ్ ప్రభుత్వం పనితీరుకు అద్దం పడుతోందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. రమణ్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తున్నాయని చెప్పారు. చత్తీస్గఢ్ వాతావరణాన్ని ఇవి బాగా మారుస్తాయని అభిప్రాయపడ్డారు. మావోయిస్టుల లొంగుబాటుకు ప్రభుత్వం ఎల్డబ్ల్యూఎఫ్ను తీసుకు వచ్చిందని, ఇది మరింత ఫలితాన్ని ఇస్తుందని ఆకాంక్షించారు.