62 ఏళ్ల వృద్దురాలికి వేధింపులు... ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు...
అపార్ట్మెంటులోని పార్కింగ్ స్థలానికి సంబంధించి తలెత్తిన ఓ వివాదంలో 62 ఏళ్ల వృద్దురాలు ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. షణ్ముగం తనను వేధింపులకు గురిచేస్తున్నారని,తన ఇంటి ముందు మూత్ర విసర్జన కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు,దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని కూడా జతచేసి సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అందజేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అసలేం జరిగింది..
చెన్నైలోని ఓ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంటులో 62 ఏళ్ల వృద్దురాలు ఒంటరిగా నివసిస్తోంది. అపార్ట్మెంటులో ఆమెకు కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు డా.సుబ్బయ్య షణ్ముగం వాడుకుంటున్నాడు. ఇందుకు గాను ఆమెకు డబ్బులు కూడా చెల్లించడం లేదు. దీనిపై అతన్ని ప్రశ్నించగా... ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. సర్జికల్ మాస్కులు ఆమె ఇంటి వైపు విసిరేయడం,ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం వంటి చర్యలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల ఆమె ఇంటి సైన్ బోర్డు కూడా పగలగొట్టాడు.
సీసీటీవీ ఫుటేజీ కూడా సమర్పించిన వృద్దురాలు
సుబయ్య వేధింపులు భరించలేక ఆ వృద్దురాలు జూలై 11న అడంబాక్కమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పార్కింగ్ స్థలాన్ని వాడుకుంటున్నందుకు డబ్బులు చెల్లించాలని అందులో పేర్కొంది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ... దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా జతచేసింది. వృద్దురాలి ఫిర్యాదుపై డీఎంకె పార్టీ కూడా స్పందించింది. షణ్ముగంపై చర్యలు తీసుకోవాలని డీఎంకె డిమాండ్ చేసింది. రైట్ వింగ్కి చెందినవారు ఎలాంటి తప్పులు చేసినా చూసీ చూడనట్లు వదిలేయడం పోలీసులకు అలవాటుగా మారిపోయిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.
ఖండించిన షణ్ముగం....
మరోవైపు షణ్ముగం మాత్రం వృద్దురాలి ఆరోపణలను ఖండించారు. ఆమె దురుద్దేశపూర్వకంగానే తనపై ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. పోలీసులకు ఆమె సమర్పించిన సీసీటీవీ ఫుటేజీ కల్పితమని,తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆరోపించారు. వృద్దురాలిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి మాట్లాడుతూ... పార్కింగ్ వివాదం నిజమేనని పేర్కొనడం గమనార్హం. ఇద్దరు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్లనే సమస్యలు తలెత్తాయని అన్నారు.
Recommended Video
వృద్దురాలి భద్రత పట్ల బంధువుల ఆందోళన...
వృద్దురాలి మేనల్లుడు బాలాజీ విజయరాఘవన్ మాట్లాడుతూ... పోలీసులు తమ అత్తయ్యకు సహకరించట్లేదని అన్నారు. షణ్ముగం తమకు క్షమాపణలు చెప్పాడని... అందుకు తాము కూడా సానుకూలంగానే స్పందించామని తెలిపారు. అయితే తమ అత్తయ్య భద్రత పట్ల తమకు ఆందోళన ఉందని... పోలీసులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.