మూడు వారాల్లోనే 10 లక్షల కొత్త కరోనా కేసులు: 20 లక్షలకు చేరిక, ఐనా దేశం కోలుకుంటోంది!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. గురువారం నాటికి దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలకు చేరుకోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ తర్వాత భారతదేశమే ఉంది. కరోనా కేసుల విజృంభణ ఇలాగే కొనసాగితే ఈ రెండు దేశాలను కూడా అధిగమించే అవకాశంలేకపోలేదు.
1 శాతం కంటే తక్కువ కేసులే..
1300 మిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో 20 లక్షల కేసులంటే పెద్ద విషయం కాదని, ఇది మొత్తం జనాభాలో ఒక శాతం కూడా కాదని సఫ్దర్జంగ్ఆస్పత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ జుగల్ కిశోర్ తెలిపారు. ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు బయటపడతాయని చెప్పారు. కరోనా రోగులను ముందుగా గుర్తించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి..
కాగా, భారతదేశంలో మొదటి కరోనా కేసు జనవరి 30న నమోదైంది. ఆ తర్వాత క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. జలై 16 నాటికి దేశంలో కరోనా కేసులు పది లక్షలకు చేరాయి. అయితే, గత మూడు వారాల్లోనే 20 లక్షలకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడం గమనార్హం. కరోనా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపిస్తున్న కారణంగానే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ కంటెంపరరీ స్టడీస్ సీనియర్ రీసెర్చ్ ఫెలో అమీర్ ఉల్లాహ్ ఖాన్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందకపోవడం కూడా కరోనా కేసుల పెరుగుదలకు, మరణాలకు కారణమని అన్నారు.
అమెరికాను భారత్ దాటేస్తుంది..?
కరోనా కేసుల సంఖ్యలో ఈ ఏడాదిలోగా అమెరికాను భారత్ అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అమీర్ చెప్పారు. కరోనా పరీక్షలను పెంచడం, అవసరమైన చోట్ల మళ్లీ లాక్డౌన్ పెట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని, డబ్బును అవసరాలకు అనుగుణంగా ఉపయోగించాలని సూచించారు. భారత్ లాంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ముందు జాగ్రత్తలే అతి ముఖ్యమైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
20లక్షల కేసులు.. ఐనా భారత్ కోలుకుంటోంది..
దేశంలో ఇప్పటి వరకు 20,25,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 6,05,933 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 13,77,384 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 41,638 మంది కరోనా బారినపడి మరణించారు. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నప్పటికీ... కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రికవరీ రేటు 67.62శాతంగా ఉండటం గమనార్హం.