కరోనా: 63 శాతం 60 ఏళ్లకు పైగా వృద్దులే, 7 శాతం 40 ఏళ్ల లోపు, మృతుల వివరాల శాతం ఇదే...
దేశంలో కరోనా మరణాలు వంద పైగా చేరిన సంగతి తెలిసిందే. అయితే వైరస్ సోకిన వృద్దులే ఎక్కువ శాతం ఉన్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. 60 ఏళ్లు.. ఆ పైబడిన వారు ఎక్కువమంది ఉన్నారని.. 40 ఏళ్లలోపు చనిపోయిన వారు కేవలం 7 శాతం మంది ఉన్నారని పేర్కొన్నది. ఇదివరకు వైద్యులు సూచించిన ప్రకారం వృద్దులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వైరస్ సోకితే కోలుకోవడం కష్టమని అర్థమవుతోంది.
7 శాతం వీరే...
దేశంలో కరోనా వైరస్ పాజిటి కేసులు 4 వేల పైగా చేరుకుంది. అయితే ఇందులో 19 శాతం మాత్రమే వృద్దులు ఉన్నారు. అయితే ఇప్పటివరకు చనిపోయిన వారిలో వృద్దులే 63 శాతం ఉన్నారనే కఠోర వాస్తవాన్ని వైద్యారోగ్య శాఖ తెలిపింది. అయితే వీరిలో 86 శాతం మంది డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నది. 40 నుంచి 60 ఏళ్ల లోపు వారు 30 శాతం మంచి చనిపోయారని అధికారులు వెల్లడించారు. కేవలం 7 శాతం మాత్రమే 40 ఏళ్ల లోపు వారు ఉన్నారు.
పురుషులే ఎక్కువ..
వైరస్ సోకి చనిపోతున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారని అధికారులు వివరించారు. వైరస్ సోకిన వారు కూడా పురుషులే అధికంగా ఉన్నారు. పురుషులు 76 వాతం ఉండగా.. మహిళలు కేవలం 24 శాతం మాత్రమే ఉన్నారు. చనిపోయిన వారు కూడా 73 శాతం మంది పురుషులే ఉండగా.. స్త్రీలు 27 శాతం మంది ఉంటారని తెలిపారు. వైరస్ సోకిన వారి నిష్పత్తి పురుషులు ముగ్గురు ఉండగా ఒక్కరు మహిళ ఉన్నారు.
ఇదీ రోగుల శాతం..
శనివారం రోజున వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా వైరస్ పాజిటివ్ రోగుల వివరాలు ఇలా ఉన్నాయి. 8.6 శాత మంది రోగులు 20 ఏళ్ల లోపు వారు అని.. 41.9 శాతం మంది 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వారు అని.. 32.8 శాతం మంది 41 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు అని, 16.7 శాతం మంది మాత్రం 60, ఆపై ఏళ్లకు చెందిన వారు అని వెల్లడించారు.