లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం ఎంత.. ఈసారి ఎంతమంది గెలుస్తారు..?
ఢిల్లీ : మహిళల విషయానికొస్తే ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటారు. ఇంటి పనుల్లో ఆ సగానికి మించి బరువు బాధ్యతలు మోస్తున్న మహిళలకు.. చట్టసభల్లో మాత్రం సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఓటర్ల శాతం కూడా సగానికి సగం ఉన్నారు. అయినా రాజకీయంగా వారికి దక్కాల్సిన వాటా దక్కలేకపోతుందనే వాదనలున్నాయి.
లోక్సభలో 543 స్థానాలకు ఎంపీలుగా అవకాశముంటే.. అందులో మహిళల సంఖ్య 65 మాత్రమే. ఈ లెక్కన దాదాపు 12 శాతమే. ఆయా పార్టీలు రాజకీయంగా వారిని ప్రోత్సహించలేకపోతున్నాయనే ఆరోపణలున్నాయి. మహిళలు వంటింటికే పరిమితం కాదని నిరూపిస్తూ ఆయా రంగాల్లో దూసుకెళుతున్న తరుణంలో కూడా చట్టసభల్లో వారికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదు.
ఈసారి 542 లోక్సభ స్థానాలకు గాను మొత్తం 7 వేల 928 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అందులో 724 మంది మహిళలు బరిలో నిలిచారు. అంటే 9 శాతం మాత్రమే మహిళలకు ఆయా పార్టీల టికెట్లు దక్కాయి. కాంగ్రెస్ 54 మందికి, బీజేపీ 53, తృణమూల్ కాంగ్రెస్ 24, బహుజన్ సమాజ్ పార్టీ 24, సీపీఎం 10, సీపీఐ నలుగురికి, ఎన్సీపీ ఒకరికి టికెట్లు ఇచ్చాయి. అదలావుంటే ఇండిపెండెంట్లుగా మరో 222 మంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు.
2014 నాటి ఎన్నికల్లో 65 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం తక్కువగా ఉందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈసారి ఎంతమంది గెలుస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.