ఇంజెక్షన్కు భయపడి పారిపోయింది, చిరుతపులి బోనులో చిక్కుకున్న మహిళ
సూరత్: చిరుతపులిని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులో ఓ 65 ఏళ్ల మహిళ చిక్కుకుపోయింది. ఆమె రాత్రంతా చలికి వణికి అందులోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆమెను బయటకు తీశారు. ఆమె తెలియకుండా చిరుత బోనులోకి వెళ్లి చిక్కుకుపోయింది. ఆమె అందులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని తాపి జిల్లాలో చోటు చేసుకుంది. భాన్వాడీ గ్రామానికి చెందిన 65 ఏళ్ల కమ్లీ ఖుసాల్ చౌదరీ కొంతకాలంగా కీళ్లనొప్పులతో బాధపడుతోంది. ఈ నెల 26వ తేదీన ఆమె మరో గ్రామమైన లొతార్వాను దాటి ఓ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు ఇంజెక్షన్ ఇస్తానని డాక్టర్ చెప్పాడు.
ఆమెకు ఇంజెక్షన్ అంటే భయం. దీంతో ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి బయటపడింది. కాలినడకన ఇంటికి వస్తోంది. అదే సమయంలో లొతార్వాలో తిరుగుతున్న ఓ చిరుతపులిని బంధించేందుకు అధికారులు ఆ దారిలో బోనును ఏర్పాటు చేశారు.
చీకటిలో బోనును ఆమె గుర్తించలేదు. దానిని ఓ గేటుగా భావించి దాటే ప్రయత్నాలు చేసింది. ఆమె లోపలికి ప్రవేశించగానే బోను తలుపులు మూసుకుపోయాయి. బయటకు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో చలిలో రాత్రంతా ఆమె అందులోనే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం స్థానికులు బోను నుంచి ఆమెను బయటకు తెచ్చారు. జ్వరంతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు.