దారుణం : 68 మంది విద్యార్థినులను.. లోదుస్తులు తొలగించాలన్న ప్రిన్సిపాల్..
గుజరాత్లోని ఓ కాలేజీ విద్యార్థినుల పట్ల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించిన ఘటన వెలుగుచూసింది. విద్యార్థునుల్లో ఎవరెవరు నెలసరిలో ఉన్నారో తెలుసుకునేందుకు.. వారందరినీ వరుసలో నిలబెట్టి లోదుస్తులు తొలగించాల్సిందిగా ప్రిన్సిపాల్ ఆదేశించింది. నెలసరి సమయంలో గుడి,కిచెన్తో పాటు ఇతర విద్యార్థులను తాకకుండా వారిని దూరంగా ఉంచేందుకు ఈ చర్యకు పాల్పడ్డారు. గుజరాత్లోని బుజ్లో శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్లో(SSGI)లో ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది..
శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్లోని హాస్టల్ వార్డెన్ ఇటీవల విద్యార్థినులపై కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. కొంతమంది విద్యార్థినులు నెలసరి సమయంలో సాంప్రదాయ నియమాలను పాటించడం లేదని ఫిర్యాదు చేసింది. కాలేజీ ప్రాంగణంలోని ఆలయంలోకి వెళ్తున్నారని, తోటి విద్యార్థులను తాకుతున్నారని, కిచెన్ లోపలికి కూడా వెళ్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ క్లాస్రూమ్స్లో ఉన్న 68 మంది విద్యార్థినులను బయటకు పిలిపించింది.
వాష్ రూమ్ వద్ద లైన్లో నిలబెట్టి..
క్లాస్రూమ్ నుంచి బయటకు పిలిపించాక.. వారందరినీ వాష్ రూమ్ వద్దకు తీసుకెళ్లి వరుసలో నిలబెట్టారు. ఆపై ఒక్కొక్కరు తమ లోదుస్తులు తొలగించి.. నెలసరిలో ఉన్నారో.. లేరో.. చూపించాలని ప్రిన్సిపాల్ ఆదేశించారు. దీంతో ఇద్దరు విద్యార్థులు క్యూ లైన్ నుంచి పక్కకు తప్పుకుని తాము నెలసరిలో ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్ తమపై దుర్భాషలాడారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
సాంప్రదాయ నియమాలు తప్పనిసరి..
భారతీయ విలువలు,సాంప్రదాయాలు అనే పునాదులపై శ్రీ సహజనంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. కాబట్టి సాంప్రదాయ విలువలకు ఇక్కడ పెద్ద పీట వేస్తారు. ఇక్కడి నియమాల ప్రకారం.. నెలసరి సమయంలో విద్యార్థినులు ఆలయంలోకి,కిచెన్లోకి వెళ్లరాదు. అదే సమయంలో ఇతర విద్యార్థులను కూడా తాకరాదు. ఈ నేపథ్యంలోనే హాస్టల్ వార్డెన్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. కాగా, స్వామి నారాయణ్ ద్విశతాబ్ది మెడికల్&చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఇనిస్టిట్యూట్లో దాదాపు 1500 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
ఆవేదన చెందుతున్న విద్యార్థినులు..
మరోవైపు విద్యార్థినులు మాత్రం కాలేజీ యాజమాన్యం తీరును తప్పు పడుతున్నారు. ఎక్కడో మారు మూల గ్రామాల నుంచి చదువుకోవడానికి తాము ఇక్కడకు వచ్చామని.. కానీ ఇక్కడ తమకు ప్రత్యేక హాస్టల్ వసతి కూడా లేదని అంటున్నారు. కాలేజీ క్యాంపస్ ప్రాంగణంలోనే ఉన్న స్కూల్ భవనంలోని విద్యార్థుల హాస్టల్లో తమను కూడా ఉంచుతున్నారని వాపోతున్నారు. తాజా ఘటనపై ఇప్పటికైతే పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మరోవైపు జరిగిన ఘటనపై ట్రస్ట్ సభ్యులు పీహెచ్ హిరానీ మాట్లాడుతూ.. ఇనిస్టిట్యూట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోందని.. ట్రస్ట్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థినులు నడుచుకోవాలని చెప్పారు. అదే సమయంలో విద్యార్థినులకు జరిగిన అవమానాన్ని తప్పు పట్టారు.