గొడ్డు మాంసం అమ్ముతావా.. పంది మాంసం తిను: అస్సోంలో దారుణం
అస్సోం: అస్సోంలో దారుణం చోటుచేసుకుంది. గోమాంసం అమ్ముతున్నాడన్న నెపంపై ఓ 68 ఏళ్ల వృద్ధుడిని కొందరు చితకబాదారు. అంతేకాదు ఆయనతో బలవంతంగా పందిమాంసంను తినిపించారు. ఈ ఘటన ఏప్రిల్ 7న బిస్వనాథ్ చారియాలీలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది.
నాడు మోడీకి జై కొట్టిన వారే నేడు నై అంటున్నారు.. రాహుల్ పరిస్థితి ఏంటి..?
బీఫ్ అమ్ముతున్నాడని వృద్ధుడిని చితకబాదిన అల్లరిమూకలు
అస్సోంలో షౌకత్ అలీ అనే 68 ఏళ్ల వృద్ధుడిపై కొందరు దాడి చేశారు. గోమాంసం విక్రయిస్తున్నాడని కొందరు ఆయన్ను చుట్టుముట్టి చితకబాదారు. అనంతరం ఆయనతో పంది మాంసంను బలవంతంగా తినిపించారు. షౌకత్ అలీని చితకబాదుతున్న సమయంలో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్గా మారడంతో అసలు విషయం బయట పడింది. తనను కొట్టొదంటూ షౌకత్ అలీ ప్రాధేయపడుతున్నట్లుగా వీడియోలో ఉంది. గోమాంసంను ఎలా అమ్ముతున్నావు ఇందుకు లైసెన్స్ ఉందా అని బాధితుడిని దాడిచేసిన వారు అడుగుతుండటం వీడియోలో వినిపిస్తుంది.
ఏ దేశం నుంచి వచ్చావు అంటూ ప్రశ్న..?
అసలు భారత దేశానికి చెందిన వ్యక్తివా లేక బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తివా అంటూ తన జాతీయతను నిరూపించుకోవాలని షౌకత్ అలీని కోరింది దాడి చేసిన బృందం. తన దగ్గర నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ సర్టిఫికేట్ ఉందా అంటూ ప్రశ్నించింది. షౌకత్ అలీ పై దాడి సంఘటన పోలీసుల వద్దకు చేరింది. అలీ ఆ ప్రాంతంలో ఓ తినుబండారాల దుకాణం నడుపుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ దుకాణంను గత 35 ఏళ్లుగా నడుపుతున్నాడని పోలీసులు చెప్పారు. అయితే వారం వారం జరిగే సంతలో అలీ గోమాంసం అమ్ముతున్నట్లు దాడి చేసిన బృందం ఆరోపిస్తోందని పోలీసులు తెలిపరు.
ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
సోషల్ మీడియాలో వైరల్ అయిన మరో వీడియోలో అల్లరిమూకలు షౌకత్ అలీని చితకబాది పందిమాంసం తినిపిస్తున్న దృశ్యాలు కనపించాయి. తీవ్రగాయాలపాలైన షౌకత్ అలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.వారాంతపు సంతకు సంబంధించిన మేనేజర్పై కూడా అల్లరిమూకలు దురుసుగా ప్రవర్తించారు. ఇదిలా ఉంటే ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఒకటి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు, మరొకటి షౌకత్ అలీ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇవి మతపరమైన ఘర్షణ కాదని పోలీసులు స్పష్టం చేశారు.
ఘటన చాలా బాధాకరం: అసదుద్దీన్
షౌకత్ అలీపై జరిగిన దాడిని ఖండించారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఘటన తనను ఎంతగానో బాధించిందని ట్విటర్లో పోస్టు చేశారు. అస్సోంలో గోమాంసం విక్రయించడం తప్పు అని చట్టంలో ఉందో లేదో తెలియదుగానీ ఓ వృద్ధుడిని పట్టుకుని చితకబాదడం దేశంలో ఎక్కడ జరిగినా నేరం కిందికే పరిగణిస్తామని ట్విటర్లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే అస్సోంలో బీఫ్పై నిషేధం లేదు.ఇక అస్సోం పశుసంరక్షణ చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన పశువులను వధించేందుకు అక్కడి చట్టం అనుమతిస్తోంది. అయితే వెటిరినరీ డాక్టర్ నుంచి ఓ పశువును వధించొచ్చు అని ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని ఆ చట్టం చెబుతోంది.