విషాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం..
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. 29 మందితో ప్రయాణిస్తున్న వాహనం కాలువలో పడింది. ఈ ఘటనలో అంతవరకు ఆడిపాడి నిద్రలోకి జారుకున్న ఏడుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. యూపీ రాజధాని లక్నోకు కూతవేటు దూరంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. బాధితుల హాహాకారాలు విన్న స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని 22 మందిని రక్షించారు. గాయాలపాలైన వారందరినీ ఒడ్డుకు చేర్చి హాస్పిటల్కు తరలించారు.
దారుణం : పసిపాప ప్రాణం తీసిన డాక్టర్లు
బాధితులంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. లక్నో శివారులోని నగ్రం ఏరియాలో ఇందిరా కెనాల్ సమీపంలోకి వచ్చిన వెంటనే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం కాలువలోకి దూసుకుపోయింది. మరణించిన ఏడుగురు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యల్లో నిమగ్నమైంది. చిన్నారుల మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు కాలువను జల్లెడ పడుతున్నారు.
ఇందిరా కెనాల్లో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నీటి ప్రవాహాన్ని నియంత్రించి గాలింపు చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎస్పీ ఎస్కే భగత్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దిగువన ఉన్న ప్రాంతాల్లో వలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకవేళ పిల్లలు కొట్టుకుని వస్తే వలల్లో చిక్కుకుంటారని చెప్పారు. వాహనం కాలువలో పడిన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.