ట్యాంకర్ను ఢీకొన్న వోల్వో బస్సు: 7గురు సజీవదహనం
ముంబై: బుధవారం ఉదయం మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం జరిగింది. మనోర్ వద్ద డీజిల్ ట్యాంకర్, వోల్వో బస్సు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలో రూ.8 కోట్ల దోపిడీ
మరోవైపు దక్షిణ ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన లజపత్ నగర్ వద్ద ఒక వ్యాపారి వద్దనుంచి రూ.7.69 కోట్ల నగదును దుండగులు దోచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన్నారు.
స్థిరాస్తి వ్యాపారి రాకేష్ కర్లా తన హోండా సిటీ కారులో ఈ డబ్బును రెండు బ్యాగుల్లో నింపి బ్యాంకులో డిపాజిట్ చేద్దామని లజ్పత్నగర్ మెట్రోస్టేషన్ సమీపానికి వచ్చాడు. అదే సమయంలో కర్లా వాహనం ముందు ఒక కారు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఆ కారులో ఉన్నవారితో కర్లా కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడు.
ఇంతలో హర్యానా రిజిస్ట్రేషన్ నంబరున్న మరో కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆయనను అటకాయించి, ఆయుధాలతో బెదిరించి రూ.7.69కోట్ల నగదును లాక్కొని కర్లా వాహనంతో సహా పరారయ్యారు. కాగా, ఢిల్లీలోనగదుకు సంబంధించి జరిగిన దోపిడీల్లో ఇదే అతిపెద్ద దోపిడని స్థానిక వర్గాలంటున్నాయి. దోపిడి జరిగిన కొన్ని గంటల అనంతరం కర్లా కారును సేవానగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలోగుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.