ఛత్తీస్గఢ్లో మావోల ప్రతీకార చర్య: ఏడుగురు జవాన్లు హతం..
బస్తర్: వరుస ఎన్ కౌంటర్లకు మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఆదివారం ఉదయం దంతెవాడ జిల్లాలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న ఓ వాహనాన్ని మావోయిస్టులు పేల్చేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మరణించారు. పేలుడు అనంతరం పోలీసుల వద్ద ఉన్న 7 తుపాకులను తీసుకుని మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు.
ఇదే ఘటనలో గాయపడ్డ మరో జవాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతనికి రాయ్ పూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు విషయాన్ని స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అవాస్తి ధ్రువీకరించారు.
'కిరందుల్, అరాంఘపూర్ రోడ్డు పనులు ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయి. ఈమధ్యే పనులను తిరిగి ప్రారంభించాం. ఇక్కడి పనుల కోసం జవాన్లు తమ వాహనంలో మెటీరియల్ తీసుకెళ్తుండగా.. చోల్నార్, కిరందుల్ మార్గంలోని కల్వర్టు వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు' అని ఆయన తెలిపారు.
చనిపోయిన జవాన్లను రామ్ కుమార్ యాదవ్(హెడ్ కానిస్టేబుల్), తికేశ్వర్ ధ్రువ్(కానిస్టేబుల్), సలిగారం(అసిస్టెంట్ కానిస్టేబుల్), విక్రమ్ యాదవ్(అసిస్టెంట్ కానిస్టేబుల్), రాజేశ్ సింగ్(కానిస్టేబుల్), వీరేంద్ర సింగ్(కానిస్టేబుల్)గా గుర్తించారు.
కాగా, గత ఏప్రిల్ నెలలో భద్రతా బలగాలు 8మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ఇందులో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. అది జరిగిన కొద్దిరోజులకే మహారాష్ట్ర గడ్చిరోలిలో 39మంది మావోయిస్టులను హతం చేశారు. ఈ ఘటనలకు ప్రతీకారంగానే మావోయిస్టులు జవాన్ల వాహనాన్ని పేల్చి వేసి ఉంటారని భావిస్తున్నారు.