అరేబియా సముద్రంలో కొత్త అల్పపీడనం: ఏపీ సహా: పొంచివున్న ముప్పు: బురెవికి బలి
తిరువనంతపురం: మరో తుఫాన్ ముప్పు పొంచివుంది. నివర్, బురెవి తుఫాన్లు మిగిల్చిన విధ్వంస పరిస్థితులు కుదుట పడక ముందే..మరో తుఫాన్ పుట్టుకుని రావాడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ జంట తుఫాన్ల బారిన పడిన ఏపీ సహా తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఒకవంక సహాయ, పునరావాస కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూ ఉండగానే.. అవే రాష్ట్రాలు మరోసారి తుఫాన్ విరుచుకు పడటానికి అవకాశాలు ఉన్నాయి.
Recommended Video
అరేబియా సముద్రంలో అల్పపీడనం..
అరేబియా సముద్రంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది మరింత బలపడటానికి అవసరమైన అనుకూల వాతావరణం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే 72 గంటల్లో వాయుగుండంగా మరొచ్చని చెబుతున్నారు. కొత్త అల్పపీడనం ప్రభావంతో కేరళ, కర్ణాటక దక్షిణ ప్రాంతం జిల్లాల్లో భారీ వర్షాలు, తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
వెంటవెంటనే తుఫాన్లు..
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్, బురెవి తుఫాన్లు తూర్పు దిశ నుంచి దాడి చేయగా.. ఈ సారి ఆ డ్యూటీని అరేబియా సముద్రం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం పశ్చిమ దిశ నుంచి దాడి చేయడానకి సమాయాత్తమౌతోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర ఉపరితల వాతావరణంలో చోటు చేసుకుంటోన్న అనూహ్య మార్పుల ఫలితంగా వెంటవెంటనే తుఫాన్లు పుట్టుకుని రావడానికి కారణమౌతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకే సీజన్లో..కొన్ని రోజుల స్వల్ప వ్యవధిలో అల్పపీడనం ఏర్పడటం అరుదుగా భావిస్తున్నారు.
కేరళలో భారీ వర్షాలు
ఈ అల్పపీడనం ప్రభావం వల్ల కేరళలో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఇడుక్కి, మళప్పురం, తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ సహా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలు, తమిళనాడు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తిరువనంతపురంలోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే సంతోష్ తెలిపారు. వచ్చేవారం రోజుల్లో కేరళలో మరింత అధిక వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.
బురెవికి ఏడుమంది బలి
ఇదిలావుండగా- బురెవి తుఫాన్ ధాటికి ఏడుమంది బలి అయ్యారు. బురెవి తుఫాన్ ప్రభావం వల్ల సంభవించిన ఘటనల్లో వారంతా మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించింది. వేర్వేరు జిల్లాల్లో సంభవించిన వర్ష ఆధారిత ఘటనల్లో ఏడుమంది మరణించినట్లు తెలిపింది. తుఫాన్ వల్ల 75 గుడిసెలు నేలమట్టం అయ్యాయి. మరో రెండు వేలకు పైగా పూరి గుడిసెలు, పక్కా గృహాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వందలాది పశువులు మరణించాయి. వాటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది.