భద్రజీవుల గుండెల్లో రాయి: ఇండియాలో మాయమైపోతున్న ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఉద్యోగం చేసుకుంటే నెలజీతంపై ఆధారపడి బ్రతుకు వెళ్లదీసే.. సగటు భద్రజీవికి ఇదో షాకింగ్ న్యూస్. దేశంలో నిత్యం 550 ఉద్యోగాలు యాయమైపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగాలు కనిపించకుండా పోతాయని నివ్వెరపోయే విషయం వెల్లడించింది సివిల్ సొసైటీ గ్రూప్ ప్రహార్ వెల్లడించింది.
ముఖ్యంగా రిటైల్ వెండార్లు, కాంట్రాక్టు కూలీలు, నిర్మాణ రంగ కార్మిక విభాగాల్లో పనిచేస్తున్నవారికి భవిష్యత్తులో వారి ఉపాధి సందిగ్ధంలో పడే అవకాశాలున్నట్లు తెలిపింది. తాజాగా లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. 2015లో ఇండియాలో 1.35 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాగా.. ఆ సంఖ్య 2011 నాటికి 9 లక్షల ఉద్యోగాలకు పడిపోయింది. ఆపై 2013లో మరింతగా తగ్గి 4.19 లక్షల ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైంది.
ఈ లెక్కలను బేరీజు వేస్తే.. సగటున రోజుకు 550 ఉద్యోగాలు మాయమైపోతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే.. దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం 50శాతం మేర ఉద్యోగాలు వ్యవసాయ రంగం నుంచే ఉండగా, 40శాతం ఉద్యోగాలు చిన్న పరిశ్రమలు, సంస్థల ద్వారా అందుతున్నాయి. సంఘటిత రంగంలో కేవలం 3కోట్ల ఉద్యోగాలు మాత్రమే ఉండగా, అసంఘటిత రంగంలో 44కోట్ల ఉద్యోగాలున్నాయి.
ఇక ప్రస్తుత లెక్కలను గమనిస్తే.. వ్యవసాయ రంగంలోను 10శాతం మేర ఉపాధి అవకాశాలు పడిపోయాయి. 1994లో వ్యవసాయ రంగంలో 60 శాతం మంది ఉపాధిని పొందుతుండగా, ఆ సంఖ్య 2013 నాటికి 50 శాతానికి పడిపోయింది. ఎస్ఎంఈ (స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్) రంగం నుంచి ఇప్పటిదాకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు నమోదవుతుండగా.. మల్టీనేషనల్ కంపెనీల రంగ ప్రవేశంతో ఆ రంగం కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది.
ఇదే సమయంలో.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పలు విదేశీ కంపెనీలు దేశంలో దాదాపు 225 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడుతోన్న నేపథ్యంలో.. కొత్తగా 60 లక్షల వరకూ కొత్త ఉద్యోగాలు రావచ్చని అంచనా వేసింది సివిల్ సొసైటీ గ్రూప్ ప్రహార్ సంస్థ. ఇండియాకు స్మార్ట్ సిటీల కన్నా స్మార్ట్ విలేజీలు చాలా అవసరం అని చెప్పిన సంస్థ.. దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగంతో పాటు ఎస్ఎంఈ కంపెనీలు నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపడే అవకాశముందని పేర్కొంది.