నీట్,జేఈఈ : కేంద్రంతో అమీతుమీకి ఏడుగురు సీఎంలు... సుప్రీంలో తేల్చుకునేందుకు రెడీ...
నీట్,జేఈఈ పరీక్షల వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం నిర్ణయాన్ని వారు సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఏడుగురు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
Recommended Video
సుప్రీంలోనే తేల్చుకుందామన్న మమతా...
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ... సహకార సమాఖ్య విధానం పేరుతో రాష్ట్రాల హక్కులను హరించివేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లి కేంద్రంతో తేల్చుకుందామన్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని... విద్యార్థులకు మానసికంగా సతమతమవుతున్నారని... వారి భవిష్యత్తు కోసం మనం తప్పకుండా గొంతు విప్పాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను రిస్క్లో పెట్టడాన్ని ప్రశ్నించాలన్నారు. దీనిపై ఇదివరకే ప్రధానికి లేఖ రాశామని... అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని అన్నారు.
ఇంకా భయపడుదామా.. పోరాడుదామా..: ఉద్దవ్ థాక్రే
ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాల్సిందేనన్నారు. కేంద్రానికి ఇలాగే భయపడుతూ పోదామా... లేక పోరాడుదామా అన్నది తేల్చుకోవాల్సిన అసవరం ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సిందేనని... అయితే దానికి ఇప్పుడు సరైన సమయం కాదని అన్నారు. అమెరికాలో ఇలాగే తొందరపడి స్కూళ్లు రీఓపెన్ చేశారని... ఫలితంగా 97వేల మంది కరోనా వైరస్ బారినపడ్డారని గుర్తుచేశారు.
గొంతు కలిపిన హేమంత్,అమరీందర్...
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కాస్త భిన్న వాదన వినిపించారు. సుప్రీం కోర్టుకు వెళ్లడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ లేదా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వద్దకు వెళ్దామని సూచించారు. చివరకు, మిగతా ముఖ్యమంత్రుల అభిప్రాయం మేరకు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలంటే... రవాణా సౌకర్యాలు,హాస్టల్స్,విద్యా సంస్థల భవనాలను రీఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఇంత యాక్టివిటీ విద్యార్థుల ప్రాణాలను రిస్క్లో పెడుతుందన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. 'ఈరోజు ఈ సమావేశానికి హాజరైనవాళ్లందరం కలిసి సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.
ఆహ్వానాన్ని తిరస్కరించిన కేజ్రీవాల్..
సోనియా గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఈ సమావేశంలో నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్ (పంజాబ్), భూపేష్ బాగెల్ (ఛత్తీస్గఢ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), వి నారాయణసామి (పుదుచ్చేరి) పాల్గొన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్,మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పాల్గొన్నారు. ఈ ఏడుగురు నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. తాజా సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా భావించినప్పటికీ... అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో ఆయన్ను ఆహ్వానించలేదు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానం వెళ్లినప్పటికీ... ఆయన సమావేశంలో పాల్గొనేందుకు విముఖత చూపినట్లు సమాచారం.