బీజేపీకి వెల్లువెత్తిన విరాళాలు: కాంగ్రెస్ సహా ఆ 6పార్టీలకంటే ఎక్కువే
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆర్థిక ఏడాది(2016-17) కార్పొరేట్, వ్యాపార రంగాల నుంచి, గుర్తు తెలియని వర్గాల నుంచి భారీ విరాళాలను అందుకుంది ఈ పార్టీ. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏడు జాతీయ పార్టీలకు అందిన విరాళాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
నేషనల్ ఎలక్షన్ వాచ్తో కలిసి ఈ నివేదిక రూపొందించింది. దేశంలోని ఏడు జాతీయ పార్టీలకు 2016-17లో గుర్తు తెలియని వర్గాల నుంచి అందిన విరాళాల మొత్తం రూ.710.80కోట్లు. రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తాలతో అందిన విరాళాల విలువ రూ.589.38కోట్లు.
కాగా, ఈ మొత్తంలో ఒక్క బీజేపీకే 1,194 మంది నుంచి రూ.532.27కోట్లు వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ మొత్తం సగటు విరాళాల కన్నా బీజేపీకి 9రేట్లు ఎక్కువగా విరాళాలు అందాయి. రూ. 20వేల ఎక్కువ మొత్తాలతో కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళం రూ.41.90కోట్లు.
ఆ తర్వాత బహుజన సమాజ్వాదీ పార్టీకి రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తాలతో విరాళాలు అందలేదు. కార్పొరేట్, వ్యాపార రంగం నుంచి అందిన విరాళం విలువ రూ.36.06కోట్లు కాగా, సత్య ఎలక్టోరల్ నుంచి బీజేపీకి అందిన మొత్తం రూ.251.22కోట్లు. కాంగ్రెస్ పార్టీకి అందిన మొత్తం 13.90కోట్లు.
బీజేపీకి 2015-16లో వచ్చిన విరాళాలు రూ.76.85కోట్లు కాగా, 2016-17లో రూ. 532.27కోట్లు వచ్చాయి. గుర్తు తెలియని వర్గాల నుంచి బీజేపీకి అందిన విరాళాలు రూ.464.94కోట్లు కాగా, కాంగ్రెస్ పార్టీకి ఈ రూపంలో అందిన మొత్తం రూ.126.124కోట్లు.