టీచర్లే కీచకులు: 15మంది విద్యార్థినులపై లైంగిక దాడి
కోరాపుట్: విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే వారి పాలిట కీచకులుగా మారారు. పాఠశాలలో పాఠాలు చెప్పకుండా వారిపై లైంగిక దాడికి పాల్పడిరు. ఈ దారుణ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో చోటు చేసుకుంది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దమన్జోడి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు సంబంధించి పలు ఫిర్యాదులు వస్తుండడంతో శిశు సంరక్షణాధికారులు పాఠశాలలో విచారణ చెపట్టారు.
దీనిలో భాగంగా విద్యార్థినులను ప్రశ్నించగా వారిలో 15 మంది బాలికలు.. లైబ్రరీల్లో, పాఠశాల మైదానంలో, క్లాస్ రూమ్ల్లో పలువురు ఉపాధ్యాయులు తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులపై దమన్జోడి పోలీసులు కేసు నమోదు చేసినట్లు జిల్లా శిశు సంరక్షణ అధికారి రాజశ్రీ దాస్ తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.