ఫీజు చెల్లించలేదని చితకబాదిన టీచర్: బాలుడు మృతి
బరేలి: పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ టీచర్ బాలుడ్ని చితకబాదడంతో అతడు మృతిచెందాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో గల ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆరజ్(7) అనే బాలుడి తల్లిదండ్రులు పాఠశాలకు రూ.4,500 ఫీజు చెల్లించాల్సి ఉంది.
ఫీజు వసూలు నిమిత్తం ఆగ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు బాలుడిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో బాలుడి తలపై బలంగా దెబ్బతగిలింది. దీంతో ఒక్కసారిగా బాలుడి ముక్కునుంచి రక్తం ధారగా ప్రవహించగా .. ఆరజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
చికిత్స నిమిత్తం బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ‘మీ అబ్బాయి జబ్బుపడ్డాడని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాం' అని పాఠశాల యాజమాన్యం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
తల్లిదండ్రులు వెళ్లి చూడగా బాలుడు అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహించి పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.