‘ఈ పోలీసు అంకుల్ అందర్నీ కొట్టాడు..’: ఐపీఎస్ అధికారికే షాకిచ్చిన ఏడేళ్ల బుడ్డోడు
ఓ ఏడేళ్ల బుడ్డోడు డీసీపీని వేలెత్తి చూపించాడు. అంతేకాదు, సదరు డీసీపీ తనను కొట్టాడంటూ ఫిర్యాదు చేశాడు.
కొచ్చి: ఓ ఏడేళ్ల బుడ్డోడు డీసీపీని వేలెత్తి చూపించాడు. అంతేకాదు, సదరు డీసీపీ తనను కొట్టాడంటూ ఫిర్యాదు చేశాడు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఈ ఘటన గురించి తెలియాలంటే కేరళలో కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఆందోళన గురించి తెలుసుకోవాలి.
కేరళలోని పుతువైపులో ఎల్పీజీ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొందరు నిరసరకారులు జూన్ 17న ఆందోళనకు దిగారు. అదేరోజున, ప్రధాని నరేంద్ర మోడీ కొచ్చి మెట్రో ప్రారంభోత్సవానికి కేరళ వెళ్లారు.
ప్రధాని పర్యటన సజావుగా జరిగేందుకు పుతువైపులోని నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఆ సమయంలో డీసీపీ యతిష్ చంద్ర నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న వారిపై డీసీపీ లాఠీచార్జ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
డీసీపీ యతిష్ చంద్రకి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఇన్నాళ్లకు విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో వారివారి వాదనలు వినిపించేందుకు డీసీపీ, పలువురు ఆందోళనకారులు మానవ హక్కుల కమిషన్కు వెళ్లారు.
లాఠీచార్జ్ జరిగిన సమయంలో, ఆ ప్రదేశంలో తన అంకుల్తో పాటు ఉన్న అలెన్ అనే ఏడేళ్ల బాలుడు కూడా తన కుటుంబంతో కలిసి మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వచ్చాడు.
విచారణ సందర్భంగా అలెన్ను ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని మానవ హక్కుల కమిషన్ అధికారులు అడిగారు. దీంతో అలెన్ ఎదురుగా ఉన్న డీసీపీ యతిష్ చంద్ర వైపు వేలు చూపిస్తూ ' ఈ పోలీస్ అంకుల్ ఆరోజు నన్ను, మా అంకుల్ను కొట్టాడు..' అని చెప్పాడు.
'నిజంగా కొట్టాడా?' అని కమిషన్ అధికారులు అడగ్గా.. అవునంటూ తల ఊపాడు. అలెన్ వాళ్ల అమ్మ చొక్కా పట్టుకుని అతడ్ని వెనక్కి లాగుతున్నా ఆ బుడ్డోడు డీసీపీ వైపు చూపించిన వేలు మాత్రం దించలేదు. ఈ ఘటనతో డీసీపీ యతిష్ చంద్ర కూడా అవాక్కయ్యాడు.
మీడియా దృష్టిని, అధికారుల దృష్టిని మరల్చడానికి.. 'నేను నిన్ను కొట్టానా?' అని ఆ బుడ్డోడిని నవ్వుతూ ప్రశ్నించాడు. దీనికి అలెన్ 'అవును..' అని సమాధానమివ్వడంతో అక్కడున్న వారంతా ఆ బాలుడి ధైర్యానికి ఆశ్చర్యపోయారు. ఇదీ ఈ ఘటన వెనకున్న అసలు కథ.