7ఏళ్ల బాలిక కిడ్నాప్, లైంగిక దాడి, దారుణ హత్య, కామాంధుడికి ఉరి శిక్ష, మరో వ్యక్తి ఎస్కేప్?, కోర్టులో
చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన కేసులో కామాంధుడు సంతోష్ కుమార్ కు ఉరి శిక్ష విధిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) మహిళా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇదే కేసు నుంచి మరో వ్యక్తిని తప్పించారని ఆరోపిస్తూ మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసు నుంచి విముక్తి పొందిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని బాలిక తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు కోర్టు అంగీకరించడంతో మహిళా సంఘాలు శాంతించాయి.
భార్య బలంగా ఉంది, ఆస్తీ ఇంకా బలంగా ఉంది, బ్యాంకులో డబ్బులు, సుపారి కిల్లర్స్ తో ఫినిష్ ! పక్కింటిలో!
బాలిక దారుణ హత్య
కోయంబత్తూరులోని పన్నిమడైకు చెందిన దంపతుల కుమార్తె (7) ఇదే ఏడాది మార్చి 25వ తేదీన ఇంటి సమీపంలో అదృశ్యం అయ్యింది. బాలిక కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యం అయిన మరుసటి రోజు దంపతుల ఇంటి సమీపంలో శవమై కనిపించింది.
డీఎన్ఏ పరీక్షలు
బాలిక మీద లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇదే సమయంలో కేసు విచారణ చేస్తున్న పోలీసులకు బాలిక ఇంటి సమీపంలో ఓ వృద్దురాలికి సహాయకుడిగా ఉన్న తొండముత్తూరు ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ మీద అనుమానం వచ్చి అతన్ని అరెస్టు చేశారు. అదే సమయంలో పోలీసులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి సిద్దం అయ్యారు.
జైల్లో కామాంధుడు
అన్ని పరీక్షలు నిర్వహించిన పోలీసులు సంతోష్ కుమార్ నిందితుడిగా తేలడంతో అతన్ని కటకటాలకు నెట్టారు. పోలీసులు సైతం అన్ని ఆధారాలు సేకరించి కోయంబత్తూరు మహిళా కోర్టులో సమర్పించారు. కోయంబత్తూరు మహిళా కోర్టు న్యాయమూర్తి కేసు విచారణ అప్పటి నుంచి ముమ్మరం చేశారు.
కామాంధుడికి ఉరి శిక్ష
కేసు విచారణ చేసిన న్యాయమూర్తి పోలీసులు సమర్పించిన ఆధారాలు పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. గత వారం ఈ కోసులో వాదనలు ముగిశాయి. నిందితుడు సంతోష్ కుమార్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేశాడని రుజువు కావడంతో శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి అతనికి ఉరి శిక్ష విధించారు. ఉరి శిక్షతో పాటు సంతోష్ కుమార్ కు పోక్సో చట్టం కింద యావజ్జీవ శిక్ష, సాక్షాలు, ఆధారాలు రూపు మాపేందుకు ప్రయత్నించినందుకు ఏడేళ్లు జైలు శిక్ష విధించారు. కోర్టు తీర్పుతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
మరో నిందితుడు ఎస్కేప్ ?
బాలిక మీద ఇద్దరు లైంగిక దాడి చేశారని డీఎన్ఏ పరీక్షల్లో వెలుగు చూసింది. ఇదే కేసులో మరో వ్యక్తిని తప్పించి సంతోష్ కుమార్ కు మాత్రమే శిక్ష పడేలా పోలీసులు చూశారని ఆరోపిస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. తన కుమార్తె హత్య కేసులో సంతోష్ కుమార్ తో పాటు మరో వ్యక్తికి శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లి కోవై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలిక తల్లి సమర్పించిన పిటిషన్ ను విచారణ చెయ్యడానికి కోవై కోర్టు ఆంగీకరించింది.
మహిళా సంఘాల ఆందోళన !
హత్యకు గురైన బాలిక తల్లి పిటిషన్ విచారణ చెయ్యడానికి కోర్టు అంగీకరించడంతో మహిళా సంఘాలు ఆందోళన విరమించాయి. మొత్తం మీద బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో కామాంధుడు సంతోష్ కుమార్ కు 9 నెలల్లోనే ఉరి శిక్ష పడటంతో పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.