ఏడేళ్ల బాలికపై రేప్.. బైక్పై తీసుకెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు..
జైపూర్ : రాజస్థాన్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు దారుణానికి తెగబడ్డాడు. బాలికపై అత్యాచార ఘటనతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. కొందరు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.
బైక్పై తీసుకెళ్లి అత్యాచారం
జైపూర్యలబవ శాస్త్రి నగర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల చిన్నారి ఇంటికి కాస్త దూరంలో ఆడుకుంటోంది. అక్కడకు వచ్చిన కామాంధుడు ఆ చిన్నారికి మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రికి తాను డబ్బు ఇవ్వాల్సి ఉందని ఇంటి అడ్రస్ చూపించమని బండి ఎక్కించుకున్నాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి దుర్మార్గుడి మాటలు నమ్మి బైక్పై కూర్చుంది. అయితే ఆ కామాంధుడు చిన్నారిని ఇంటికి తీసుకెళ్ల కుండా అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిన్నారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
చిన్నారిపై దాడి చేసిన దుర్మార్గుడు
ఆడుకునేందుకు బయటకెళ్లిన బాలిక ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో బాలిక తప్పిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. పాప ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా వెతికారు. దాదాపు రెండు గంటల అనంతరం తాముండే ప్రాంతానికి 15కిలోమీటర్ల దూరంలోని ఆమనీషా కాలువ వద్ద చిన్నారిని గుర్తించారు. బాలిక చెప్పిన విషయం విని షాకయ్యారు. గాయాలపాలైన చిన్నారిని జైపూర్లోని హాస్పిటల్కు తరలించారు. కామవాంఛ తీర్చుకునేందుకు బాలిక సహకరించకపోవడంతో ఆ దుర్మార్గుడు చిన్నారిని బెల్ట్తో చితకబాదాడు. బాలిక నుదుటిపై గాయం కావడంతో డాక్టర్లు కుట్లు వేశారు.
విధ్వంసం సృష్టించిన స్థానికులు
చిన్నారి రేప్ ఘటనపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. భారీ సంఖ్యలో జనం పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన మరికొందరు అక్కడ పార్క్ చేసిన వాహనాలను కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. విధ్వంసానికి పాల్పడిన 16మందిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై రేప్కు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగే అవకాశం ఉండటంతో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. నిందితున్ని పట్టుకునేందుకు 14 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు.