ఆమె ఒక్కరి కోసం.. కేరళ సర్కార్ మానవతా దృక్పథానికి జనం ఫిదా..
భారత్లో తొలి కరోనా పాజిటివ్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బందీ చర్యల కారణంగా ఇప్పుడు ఆ రాష్ట్రం కేసుల సంఖ్యలో కింది వరుసలో ఉంది. ఇప్పటివరకూ కేవలం 1270 కేసులు మాత్రమే నమోదవగా.. ప్రస్తుతం 670 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. లాక్ డౌన్ పీరియడ్లో కఠినంగా వ్యవహరిస్తూనే మానవత్వంతో కూడిన చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడింది. వలస కూలీల కోసం క్యాంపులు,అత్యధిక కరోనా టెస్టులు, ఇతరత్రా చర్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా కేరళ సర్కార్ మరోసారి మానవతా దృక్పథంతో వ్యవహరించి అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది.
కేఎస్డబ్ల్యూటీడీని సంప్రదించిన ఆమె తల్లిదండ్రులు
కరోనా లాక్ డౌన్ కారణంగా కేరళ రాష్ట్రంలో బోట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే ఇటీవల 11వ తరగతి పరీక్షల కోసం అలప్పుజా జిల్లా ఎమ్ఎన్ బ్లాక్ ప్రాంతానికి చెందిన సాండ్రా (17) కంజిరాం కొట్టాయం ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే బోటులో వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. సాండ్రా తల్లిదండ్రులు దినసరి కూలీలు. కాబట్టి ఒక బోటు మొత్తం ఖర్చును వారు భరించలేరు. ఈ నేపథ్యంలో సాండ్రా తల్లిదండ్రులు కేఎస్డబ్ల్యూటీడీ(కేరళ స్టేట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్)ను సంప్రదించారు.
ఒక్కరి కోసం బోటు..
శుక్ర,శని(మే 29,30) వారాల్లో తమ కుమార్తెకు 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని.. ఆ రెండు రోజులు కంజిరాం కొట్టాయంలోని స్కూల్కి వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉంటుందని చెప్పారు. తమ దీన స్థితి గురించి కూడా వివరించారు. దీంతో కేఎస్డబ్ల్యూటీడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. సాధారణ రోజుల్లో కనీసం 70 మంది కెపాసిటీతో నడిపే బోటును సాండ్రా ఒక్కరి కోసం నడిపేందుకు ఒప్పుకున్నారు.
కనీస చార్జి మాత్రమే..
సాండ్రాను ఆ రెండు రోజులు బోటులో కంజిరాం కొట్టాయంకు తీసుకెళ్లడమే కాకుండా.. పరీక్ష ముగిసేదాకా అక్కడే ఉండి... తిరిగి తీసుకొచ్చారు. ఇందుకోసం సాధారణ రోజుల్లో వసూలు చేసినట్టే ఆమె నుంచి కేవలం రూ.9 చార్జీని వసూలు చేశారు. బోటులో ఆమెతో పాటు పడవ నిర్వహణకు అవసరమయ్యే ఐదుగురు సిబ్బంది కూడా వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమె నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయలేదు. ఎస్డబ్ల్యూటీడీ తనకు చేసిన సాయంపై సాండ్రా సంతోషం వ్యక్తం చేసింది. 'వాటర్ ట్రాన్స్పోర్ట్ మంత్రి షాజీ వి నాయర్ నేను పరీక్షలు రాసేందుకు సహకరించారు. కొంతమంది సోషల్ వర్కర్స్ సాయంతో ఆయన్ను కలిశాను. దీంతో నా కోసం ప్రత్యేకంగా బోటు ఏర్పాటు చేశారు. ఇది నాకు,నా కుటుంబానికి అందిన గొప్ప సాయం.' అని తెలిపారు.
Recommended Video
సర్వత్రా ప్రశంసలు
ఎస్డబ్ల్యూటీడీ మంత్రి నాయర్ మాట్లాడుతూ.. 'నాకు ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె కూడా పరీక్షలు రాస్తోంది. కాబట్టి సాండ్రా పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను.' అని చెప్పారు. ఆమె నుంచి ట్రిప్పుకు కేవలం రూ.9 చొప్పున రోజుకు రూ.18 వసూలు చేసినట్టు చెప్పారు. కేరళ ప్రభుత్వం చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటే,శ్రీదేవి అనే మరో బాలిక ఇటీవల 7కి.మీ నడిచి,ఆపై మోటార్ సైకిల్,అంబులెన్స్ ద్వారా 150కి.మీ ప్రయాణించి త్రిసూర్లోని ఎస్ఎస్ఎల్సీ కేంద్రంలో పరీక్షకు హాజరైంది. ఆమె మలక్కపుర అటవీ ప్రాంతంలోని ఓ గిరిజన గూడేనికి చెందిన బాలికగా సమాచారం.