కొత్త నోట్ల: బ్యాంకు ముందు క్యూలోనే మృతి
బెంగళూరు: రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చెయ్యడంతో పాత నోట్లు మార్చుకోవడానికి క్యూలో నిలబడి ఉన్న ఓ వృద్దుడు నీరసంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కర్ణాటకలోని తుమకూరు పట్టణంలో జరిగింది.
తుమకూరు జిల్లాలోని చేలూరుకు చెందిన సిద్దప్ప (70) అనే ఆయన శనివారం బ్యాంకుల దగ్గర ప్రత్యేకంగా వృద్దులకు మాత్రమే పాత నోట్లు మార్చుకునే అవకాశం ఉందని తెలుసున్నారు. తరువాత తుమకూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్ దగ్గరకు వెళ్లారు.
ఉదయం నుంచి క్యూలో నిలబడి ఉన్న సిద్దప్ప మద్యాహ్నం 12.30 గంటల సమయంలో క్యూలోనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సిద్దప్ప మరణించారని వైద్యులు చెప్పారు.
ఉదయం నుంచి క్యూలో ఉండటం వలనే నీరసంతో సిద్దప్ప మరణించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సిద్దప్ప మరణించారని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.