మహిళపై ఖాప్ పెద్దల అమనుషం: వివస్త్రను చేసి.. గాడిదపై ఊరేగించారు
అంతేంగాక పిల్లల్ని తినేస్తుందన్న అభియోగం మోపి.. ఖాప్ పంచాయతీ సభ్యులు దుశ్శాసన పర్వానికి ఒడిగట్టారు. అభినవ కీచకులుగా మారిన ఖాఫ్ పెద్దలు పండు ముసలి మహిళను నగ్నంగా గాడిదపై ఊరేగించారు.
రాజస్థాన్ భిల్వారా జిల్లాలోని చౌహనున్కి కమెరీ గ్రామంలో ఈ అనాగరిక ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖాప్ పంచాయతీ పెద్దల ఆదేశం మేరకు బాధిత వృద్ధురాలి ముఖానికి నల్లరంగు పూసి, వివస్త్రను చేసి, గాడిదపై నగ్నంగా ఊరేగించారు.
అంతటితో ఆగకుండా ఆమెపై గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. గ్రామంలోని వారెవ్వరైనా మాట్లాడితే రూ. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బాధితురాలి భర్త 37 ఏండ్ల కిందటే చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులు దయారాం, మన్నా, సురేష్, శంకర్, పరాస్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆమెకు సంబంధించిన ఆస్తిని కాజేసేందుకే ఆమె బంధువులైన వీరు ఆమెను వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.