వందేళ్ల క్రితం ఈ విగ్రహాన్ని చోరి చేసిన పూజారి... మనువడు ఎందుకు తిరిగిచ్చేశాడో తెలుసా..?
వందేళ్ల క్రితం మదురైలోని ఓ దేవత విగ్రహం చోరీకి గురైంది. ఆ విగ్రహం 700 ఏళ్ల నాటిది. వందేళ్ల తర్వాత ఆ విగ్రహం ఓ పాతబడిన ఇంట్లో ప్రత్యక్షమైంది. ఇంతకీ దీన్ని చోరీ చేసిన వారు ఎవరు..? వందేళ్ల తర్వాత ఆ అరుదైన విగ్రహం ఎలా బయటపడింది..?
వందేళ్ల క్రితం చోరీకి గురైన విగ్రహం
తమిళనాడులోని మదురై అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది మధుర మీనాక్షి ఆలయం. మధురైలో ఈ ప్రసిద్ధి గాంచిన ఆలయంతో పాటు కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలు దర్శనమిస్తాయి. ఇక ఆ జిల్లాలోని మేలూరులో కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మితమైన ఓ ఆలయం ఉంది. నిత్యం అక్కడ పూజలు జరుగుతాయి. వందేళ్ల క్రితం అంటే 1915లో ఆ ఆలయంలో ద్రౌపది అమ్మన్ విగ్రహం చోరీకి గురైంది. అప్పట్లో ఇది పెద్ద వార్త అయ్యింది. ఎందుకంటే ఆ పురాతన విగ్రహం ఏడు వందల ఏళ్లనాటిది. ఒక దేవత విగ్రహం చోరీ కావడమంటే సాధారణ విషయం కాదు. విగ్రహం కోసం ఎంత వెతికినా దానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇక కాలక్రమేణా విగ్రహం చోరీకి గురైందన్న విషయాన్ని అంతా మర్చిపోయారు.
వందేళ్ల తర్వాత పాత ఇంట్లో ప్రత్యక్షమైన విగ్రహం
సీన్ కట్ చేస్తే ఆ విగ్రహం వందేళ్ల తర్వాత ఓ పాత ఇంట్లో ప్రత్యక్షమైంది. ఆ ఇంటికి కట్టిన గోడ మధ్యలో ఈ విగ్రహం కనిపించింది. అప్పుడెప్పుడో మాయమైన విగ్రహం ఈ ఇంటి గోడలో ప్రత్యక్షమవడం ఏంటని విచారణ చేస్తే విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ బయటపడ్డారు. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా సరిగ్గా ఈ విగ్రహ విషయంలో కూడా ఇదే జరిగింది. మేలూరు ఆలయంలో ఇద్దరు పూజారులు అప్పట్లో పూజలు నిర్వహించేవారు. అందులో ఒకరు కరుప్ప సామి. ఈ పూజారే ఆ విగ్రహాన్ని దొంగలించినట్లు తెలుస్తోంది. ఆలయంలో మరో పూజారితో కరుప్పసామి వాగ్వాదానికి దిగి ఎవరూ లేని సమయంలో ఈ విగ్రహాన్ని చోరీ చేసినట్లు తెలుస్తోంది. విగ్రహం చోరీకి గురైందన్న సంగతి 1915లో నాటి బ్రిటీషు పోలీసుల రికార్డుల్లో ఫిర్యాదు కూడా నమోదైంది.
విగ్రహం చోరీ చేసినందుకే కుటుంబానికి శాపాలు
ఇక 100 ఏళ్ల క్రితం విగ్రహం చోరీకి గురైంది. ఇక అప్పటి నుంచి కరుప్పసామి కుటుంబం శాపానికి గురైందని ఆయన మనువడు చెబుతున్నాడు. తన తాత చేసిన నేరం తనపై వేసుకున్నాడు మనువడు మురుగేశన్. 100 ఏళ్ల క్రితం తన తాత చేసిన నేరానికి ఆ తర్వాతి తరంకు చెందిన కుటుంబాలు ఎన్నో శాపానికి గురయ్యాయని చెప్పాడు 60 ఏళ్ల మురుగేశన్. భగవంతుడు శాపం పెట్టడం వల్లే ఎంతో మంది తమ కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారని చెప్పాడు. ఆరు నెలల క్రితమే విగ్రహం గోడ మధ్యలో ఉందనే రహస్యాన్ని మురుగేశన్ ఇతర కుటుంబ సభ్యులకు చెప్పాడు. అసలు అక్కడే ఆ విగ్రహం ఉందన్న విషయం మురుగేశన్ ఎలా కనుక్కున్నాడనే అనుమానం రావచ్చు. తన తాత ఎప్పుడూ ఆ గోడముందుకే వెళ్లి పూజలు చేసేవాడని చెప్పాడు. అనుమానం రావడంతో గోడపగలగొట్టి చూడగా అందులో 1.5 అడుగుల విగ్రహం కనిపించినట్లు మురుగేశన్ తెలిపాడు. వచ్చే నెలలో ఆలయ ఉత్సవాలు సందర్భంగా ఈ విగ్రహాన్ని తిరిగి ఆలయ అధికారులకు అందజేస్తామని చెప్పాడు.