నాలుగో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి: బరిలో రంగీలా గర్ల్, కన్నయ్య కుమార్
న్యూఢిల్లీ: దేశంలో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తొలి మూడు దశల్లో ఎన్నికలు ముగిశాయి. నాలుగో దశలో ఉత్తరాది రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ఆరంభం కానుంది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగిలిన చోట్ల 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు.
72 స్థానాలు..తొమ్మిది రాష్ట్రాలు
మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో 72 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. బిహార్-5, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర-17, ఒడిశా-6, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13, పశ్చిమ బెంగాల్-8 స్థానాల్లో పోలింగ్ కొనసాగబోతోంది. వాటితో పాటు జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి కూడా సోమవారమే పోలింగ్ నిర్వహించనున్నారు.
44 స్థానాల్లో బీజేపీ..
ఈ 72 స్థానాల్లో ప్రస్తుతం 44 సీట్లు బీజేపీ చేతిలో ఉన్నాయి. వాటన్నింటినీ కమలనాథులు నిలబెట్టుకుంటారా? లేదా? అనేది ఆసక్తికర అంశం. శివసేన-9, బిజూ జనతాదళ్-6, తృణమూల్ కాంగ్రెస్-6, కాంగ్రెస్-3, లోక్ జనశక్తి పార్టీ-2, సమాజ్ వాది పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీలో ఒక్కో స్థానంలో కొనసాగుతున్నారు. 12 కోట్ల 79 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. 961 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
రంగీలా గర్ల్, కన్నయ్య కుమార్ సహా పలువురు ప్రముఖులు
నాలుగో విడత పోలింగ్ లో కొన్ని చోట్ల స్టార్ వార్ ఏర్పడింది. ప్రముఖ సినీ నటి ఊర్మిళా మతోండ్కర్ (కాంగ్రెస్), జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్నయ్య కుమార్ (సీపీఐ), ప్రియా దత్ (కాంగ్రెస్), ఉత్తర్ ప్రదేశ్ మాజీ ము్ఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, (సమాజ్ వాది పార్టీ), మిలింద్ దేవరా (కాంగ్రెస్)లతో పాటు కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో వంటి నేతల భవితవ్యం నాలుగో దశ పోలింగ్ సందర్భంగా తేలిపోనుంది. బిహార్ లోని బేగుసరాయ్ నుంచి కన్నయ్యకుమార్, ముంబై నార్త్ సీటు నుంచి ఊర్మిళా మతోండ్కర్ పోటీ చేస్తున్నారు.
ముఖ్యమంత్రుల కుమారులు ఎంట్రీ..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ నాలుగో దశ ఎన్నికల బరిలో ఉన్నారు. జోధ్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి బరిలో నిల్చున్నారు. అలాగే- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ కూడా పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా నుంచి ఆయన లోక్ సభకు పోటీ చేస్తున్నారు.