షాక్: గుడిలో ప్రసాదం తిని ఆసుపత్రిలో 73 మంది, అన్నంలో బల్లి, చిన్నారులు, మహిళలు!
చెన్నై: దేవాలయంలో ప్రసాదం ఆరగించిన 73 మంది భక్తులు ఆసుపత్రి పాలైన సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలోని శాతమంగలం గ్రామంలో జరిగింది. ప్రసాదం తిని అస్వస్తతకు గురైన వారిలో ఆరు మంది పిల్లలు, 14 మంది మహిళలు ఉన్నారు.
ప్రసాదం పంపిణి
శాతమంగళంలోని అమ్మాన్ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. తరువాత భక్తులకు అన్నం, సాంబర్ తో ప్రసాదం అందించారు. ప్రసాదం ఆరగించిన కొంత సేపటికి ఆలయం ఆవరణంలో భక్తులు వాంతులు చేసుకున్నారు.
రెవెన్యూ శాఖ అధికారి
అస్వస్తతకు గురైన వారిని వెంటనే విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విరుదాచలం డివిజన్ రెవెన్యూ శాఖ అధికారి చంద్ర, తదితర అధికారులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
అన్నంలో బల్లి
కొంత మంది దాతలు ఆలయంలో అన్నం, సాంబర్ తో ప్రసాదం పంచిపెట్టారని పోలీసులు అన్నారు. అన్నంలో చనిపోయిన బల్లిని గుర్తించామని పోలీసులు చెప్పారు. 73 మంది ఆసుపత్రిపాలు కావడానికి కారణం అయిన వారి మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఆసుపత్రికి పరుగు
బాదితులకు మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు విరుదాచలం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు పరుగు తీశారు.