చెన్నైలో దారుణం... 88 ఏళ్ల వృద్దురాలిపై 73 ఏళ్ల వృద్దుడి అత్యాచారం...
చెన్నైలో దారుణం జరిగింది. ఓ వృద్దుడు వృద్దురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్దురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు పరిగెత్తుకొచ్చి నిందితుడిని పట్టుకున్నారు. ఆపై అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. తిరుమంగళం ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే... తిరుమంగళంలోని ఆల్ వుమెన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో 88 ఏళ్ల వృద్దురాలు 43 ఏళ్ల అతని కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఆమె కొడుకు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం(జులై 21) రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన 73 ఏళ్ల ఓ వృద్దుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వృద్దురాలు గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవారు పరిగెత్తుకొచ్చారు.
నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.అతను శ్రీలంకకు చెందిన బాలసుందరం అని... చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని గుర్తించారు. ఆల్ వుమెన్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై అత్యాచారం,దౌర్జన్యం,దాడితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వృద్దురాలికి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే తమిళనాడులో రెండు రోజుల క్రితం ఓ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన ఘటన పొల్లాచ్చిలో చోటు చేసుకుంది. బాలిక గర్భం దాల్చడంతో ఆమెపై లైంగిక దాడి విషయం బయటపడింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా,గడిచిన కొద్ది నెలల్లోనే ఒక్క పొల్లాచ్చి జిల్లాలోనే పోక్సో చట్టం కింద 15 కేసులు నమోదవడం గమనార్హం.