భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్ఫోర్ట్పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, పరిమిత అతిథుల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం సరిగ్గా 7.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ కొత్త పథకాన్ని ప్రకటించబోతునున్నారని తెలుస్తోంది.
ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం కోసం ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికి జరిగిన చికిత్సలు, పరీక్షలు సహా వైద్య చరిత్రను అంతటినీ డిజిటలీకరించి ఈ కార్డులో భద్రపరుస్తారు. ఆస్పత్రులు, క్లినిక్లు, వైద్యులను కేంద్ర సర్వర్తో అనుసంధానిస్తారు. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకే బడ్జెట్లో 300 కోట్ల రూపాయలను కేటాయించింది.
ప్రధాని తన ప్రసంగ సమయాన్ని కుదించినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి తీసుకుంటోన్న చర్యలను వివరించడం, భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. రక్షణరంగాన్ని బలోపేత నిర్ణయాలు, రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం, ఆర్థికరంగానికి సంబంధించిన అంశాలను ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ప్రసంగ సమయాన్ని ఇదివరకటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలతో పోల్చుకుంటే.. ఈ సారి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించినట్లు సమచారం.
ఈ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది అణువణునా తనిఖీలను ఇదివరకే పూర్తి చేశారు. రెడ్ఫోర్ట్కు దారి తీసే మార్గాలన్నింటి పైనా నిఘా ఉంచారు. వాహనానలను దారి మళ్లించారు. ఉదయం 7:30కు ప్రధానమంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేయబోతున్నందున.. ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవ సందడి ఆరంభమైంది. ఆహ్వానితులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. భద్రతా సిబ్బంది వారికి థర్మల్ స్క్రీనింగ్ను నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సిబ్బంది అణువణువునా తనిఖీలను చేపట్టారు.