జియో విధ్వంసం: టెలికాం రంగంలో 75వేల ఉద్యోగాలు మటాష్! ఇన్ ఫ్రంట్.. క్రొకడైల్ ఫెస్టివల్!
భారత టెలికాం పరిశ్రమలో సంచలనాలకు నాంది పలికి ఉచిత సేవలతో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించిన జియో మరో విధ్వంసానికి కూడా కారణమైంది. జియో రాకతో ఇతర కంపెనీలు ఆర్థిక సంక్షోభానికి లోనైన సంగతి తెలిసిందే.
ముంబై: భారత టెలికాం పరిశ్రమలో సంచలనాలకు నాంది పలికి ఉచిత సేవలతో ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించిన జియో మరో విధ్వంసానికి కూడా కారణమైంది. జియో రాకతో ఇతర కంపెనీలు ఆర్థిక సంక్షోభానికి లోనైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక్క ఏడాదిలోనే టెలికాం రంగంలో 75వేల ఉద్యోగాలు మటాష్ అయిపోయాయి. అంతేకాదు జియో ప్రభావం మున్ముందు మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఆయా టెలికం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. దీంతో ఉపాధి లేక రోడ్డున పడే ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గత ఏడాది మూడు లక్షల మంది ఉద్యోగులను వివిధ టెలికాం కంపెనీలు నియమించుకోగా వీరిలో 25 శాతం మందిపై వేటు పడింది. దీంతో ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు కుంచించుకుపోయింది.
పరిశ్రమను వదిలి వెళుతున్న వారిలో 30 శాతం మంది మిడిల్ మేనేజ్మెంట్ విభాగం ఉద్యోగులే కావడం గమనార్హం. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు అల్లకల్లోమవుతున్నారని, టవర్ సంస్థలు తమ ఆస్తులు అమ్ముకుంటున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.
మరోవైపు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ కమిటీ అందించిన సమాచారం ప్రకారం 2017 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 1.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. ఈ రంగం రానున్న కాలంలో మరింత సంక్షోభాన్ని ఎదుర్కోనుందని, ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని రిక్రూట్మెంట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.
జియో ఎంట్రీతో టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందట. ప్రత్యర్థి దిగ్గజ కంపెనీలు సైతం ఉక్కిరి బిక్కిరవుతున్నాయట. అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అయితే ఏకంగా తన సేవలకే స్వస్తి చెప్పింది.
దీనికి తోడు ఐడియా, వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు కూడా తమ టవర్ల వ్యాపారాన్ని విక్రయిస్తున్నాయి. మొత్తానికి జియో కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదని, అప్పుడే అయిపోలేదని 'ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్' అని టెలికాం రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.