ఉద్యోగం మానేసిన నెలకే 75శాతం పీఎఫ్ తీసేసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగం మానేసిన లేదా కోల్పోయిన నెల రోజుల తర్వాత ఉద్యోగి ఖాతాలోని 75శాతం పీఎఫ్ను విత్డ్రా చేసుకోవచ్చని కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ సోమవారం లోక్సభలో వెల్లడించారు.
జూన్ 26న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించామని తెలిపారు. దీని ప్రకారం ఉద్యోగం నుంచి వైదొలగి ఒక నెలపాటు ఖాళీగా ఉంటే మొత్తం పీఫ్ ఖాతాలో నుంచి 75శాతం విత్డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
అదే కొలువులో నుంచి బయటకు వచ్చిన రెండు నెలల తర్వాత పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చు. అయితే, ఒక మహిళా ఉద్యోగి వివాహ నిమిత్తం ఉద్యోగం మానేస్తున్న పక్షంలో వెంటనే విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
కాగా, ఈపీఎఫ్వో సంస్థ జూన్ 30 నాటికి ఈక్విటీ మార్కెట్లో రూ.48,946 కోట్లను పెట్టుబడి పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, నిఫ్టీ, సెన్సెక్స్కు చెందిన ఈటీఎఫ్ల్లో ఈ పెట్టుబడులను పెట్టింది. అయితే, ప్రైవేటు కంపెనీలు, షేర్లు, ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టలేదు.