మునిమనుమరాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి
ఓ వ్యక్తి తన మునిమనుమరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారానికి పాల్పడిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఓ వృద్ధుడు అత్యంత నీచ కార్యానికి ఒడిగట్టాడు. 75 ఏళ్ల ఓ వృద్ధుడు మూడున్నరేళ్ల తన ముని మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని దేవ్లాలి పట్టణానికి సమీపంలో గల షింగేవ్ బాహుల గ్రామంలో ఈ నెల 21న ఈ ఘటన జరిగింది.
చిన్నారిని ఇంటి వద్ద వదిలి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపకు గాయాలు కావడాన్ని గుర్తించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వృద్ధుణ్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్లో జరిగిన మరో ఘటనలో 14 ఏళ్ల ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఖొండేర్ గ్రామానికి చెందిన బాలిక ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో బలవంతంగా ఎత్తుకెళ్లి లైంగికదాడి చేశారు.
కాగా షాజహాన్పూర్ జిల్లా పువాయ గ్రామానికి చెందిన 17 ఏళ్ల దళిత బాలికపై ఓ యువకుడు 10 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడం, ఏడు నెలల గర్భవతి అని తెలియడంతో పారిపోయాడు. పోలీసులు అతని కోసం అన్వేషిస్తున్నారు.