అక్కాచెల్లెళ్లపై రేప్: ఫొటోగ్రాఫర్కు పదేళ్ల జైలు శిక్ష
ముంబై: అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన కేసులో 79 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించి, అతనికి ప్రత్యేక మహిళా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు శుక్రవారంనాడు తన తీర్పును వెలువరించింది. అతను ములుంద్ ప్రాంతానికి చెందినవాడు. నర్సి కటిరా అనే దోషిగా ప్రత్యేక న్యాయమూర్తి వృశాలి జోషి పదేళ్ల జైలు శిక్ష విధించారు. బాధితులిద్దరికి 25 వేల రూపాయల చొప్పున చెల్లించాలని కూడా కోర్టు దోషిని ఆదేశించింది.
కటిరాను పోలీసులు 2011 నవంబర్లో అరెస్టు చేశారు. ములుంద్ పోలీసులను బాలిక ట్యూషన్ అప్రమత్తం చేయడంతో ఆ అరెస్టు జరిగింది. ఫొటోగ్రఫీలో శిక్షణ ఇస్తుండడంతో బాలికలు కటిరా ఫ్లాట్కు వెళ్తూ ఉండేవారు. అతనికి వారి తండ్రితో పరిచయం ఉంది. ఇద్దరు బాలికలపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడా వారిని బెదిరించాడు.
అమ్మాయిల ప్రవర్తనలో ఏదో మార్పును గమనించిన ట్యూషన్ టీచర్ వారి నుంచి జాగ్రత్తగా విషయం రాబట్టారు. అత్యాచారం చేసిన సంఘటనలను కటిరా చిత్రీకరించాడు కూడా. ఇతర అమ్మాయిలతో కూడా అటువంటి చర్యలకే పాల్పడినట్లు అతని ఫ్లాట్లో స్వాధీనం చేసుకున్న సిడీల ద్వారా పోలీసులు గ్రహించారు.
నృత్య పాఠాల కోసం తాము ఓ మహిళ ఇంటికి వెళ్తుండేవాళ్లమని, అతను తమపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఆమె చూస్తూ ఉండేది తప్ప నిరోధించేది కాదని బాధితులు చెప్పారు. అయితే, నేరానికి ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.