ఇక ఓటీ లేనట్లే: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం చేదు కబురు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది కొంత చేదువార్తే. ఎందుకంటే.. అదనపు సమయం పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే భత్యాన్ని(ఓవర్ టైమ్ అలవెన్స్) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ముఖ్యమైన ప్రజా అవసరాల మేరకు పనిచేసే కొన్ని సంస్థల ఉద్యోగులకు(ఆపరేషనల్ స్టాఫ్) మాత్రం దీనిని నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు పర్సనల్ మినిస్టరీ ఆదేశాలు జారీ చేసింది.
ఏడో వేతన సంఘ సిఫారసుల అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓటీని నిలిపివేయనున్న నేపథ్యంలో వ్యయ నిర్వహణశాఖ దీనిపై స్పష్టతను ఇచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా వేతనాలను పెంచుతున్న నేపథ్యంలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు ఓవర్టైమ్ అలవెన్స్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 'అత్యవసర పని నిమిత్తం తమపై ఉన్నతాధికారి ఆదేశాల మేరకు కార్యాలయంలో ఉన్న ఉద్యోగులకు ఓటీని అందిస్తాం' అని పర్సనల్ మినిస్టరీ తెలిపింది.
కాగా, ఆపరేషనల్ స్టాఫ్ మినహా మిగిలిన వారందరూ దీనికి అంగీకారం తెలిపారని వెల్లడించింది. అన్ని మంత్రిత్వశాఖలు, వాటికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాల ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని అమలు చేయనున్నారు. కొన్ని సంస్థల్లో ప్రజా అవసరాల పనులు సజావుగా సాగేందుకు వివిధ మంత్రిత్వశాఖకు చెందని, నాన్ గెజిటెడ్ ఆపరేషనల్ స్టాఫ్కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ మేరకు ఏయే విభాగాల ఉద్యోగులు ఆపరేషనల్ స్టాఫ్ కిందకు వస్తారో జాబితాను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బయోమెట్రిక్ హాజరు విధానం ద్వారా ఓటీ భత్యాలను ఉద్యోగులకు అందించనున్నారు. ఆపరేషనల్ స్టాఫ్ మాత్రం ఓటీని ప్రభుత్వం పెంచలేదు. 1991లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే అందిస్తున్నారు.