72 గంటల నిరహరదీక్షకు రైల్వే ఉద్యోగులు, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఏడవ వేతన కమిషన్ ప్రొవిజన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ రైల్వే ఉద్యోగులు 72 గంటల పాటు నిరహరదీక్షకు దిగనున్నారు. ఈ మేరకు ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. మే 8వ తేది నుండి ఈ దీక్షను చేపట్టనున్నట్టు ఆ యూనియన్ ప్రకటించింది.
రైల్వే ఉద్యోగుల డిమాండ్లపై కేంద్రం నుండి సానుకూలంగా స్పందన లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే పలు దఫాలు తమ డిమాండ్లపై చర్చించినట్టుగా యూనియన్ నేతలు గుర్తు చేశారు.
అయినా కానీ, తమ డిమాండ్లపై కేంద్రం నుండి సానుకూలమైన సంకేతాలు రాలేదని వారు చెప్పారు.హోం మంత్రి, ఆర్థికమంత్రి, రైల్వే మంత్రి, రైల్వే సహాయ మంత్రులు మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని యూనియన్ నేతలు గుర్తు చేశారు.
ఏడవ వేతన సంఘ సిఫారసులు అమల్లోకి వచ్చాక కనీస వేతనం మెరుగు పరచాలని, ఫిట్మెంట్ ఫాక్టర్ విషయంపైనా, పెన్షన్ విషయంలోనూ పలుమార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నామని ఏఐఆర్ఎఫ్ తెలిపింది.
దీంతో ఏఐఆర్ఎఫ్తో అనుసంధానమైన అన్ని బ్రాంచులు మే 8 నుంచి మూడు రోజుల పాటు వరుసగా నిరాహార దీక్ష చేయున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ దీక్షలను కొనసాగించనున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు.