కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు, ఎంపీల కంటే ఎక్కువ జీతం
న్యూఢిల్లీ: ఏడో వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సులకు కేంద్రమంత్రి వర్గం బుధవారం నాడు ఆమోదం తెలిపింది. కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం కలిగేలా బేసిక్ను 16 శాతం పెంచేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2016 జనవరి 1 నుంచి వేతన సవరణ పెంపుదల వర్తిస్తుంది. ఆర్మీ సిబ్బంది భత్యాన్ని రూ.21 వేల నుంచి 31,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వేతనాలు పెరుగుదల ఇలా..
దాదాపు కోటిమంది ఉద్యోగులు, పింఛన్దారులకు ఆదాయం సగటున 23.5శాతం పెరగనుంది. జీతాలు కనిష్టంగా 20 శాతం. గరిష్ఠంగా 25 శాతం వరకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.
50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ పికె సిన్హా నేతృత్వంలోని ప్యానెల్ జస్టిస్ ఏకే మాథుర్ ఆధ్వర్యంలో ఓ పరిశీలన సంఘాన్ని నియమించారు. ఆ సంఘం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది.
దీనిలో జీతం, అలవెన్స్లు, పింఛనుల్లో 23.55శాతం పెంపును ఇవ్వాలని, మూల వేతనం దాదాపు పదిహేను శాతం పెంచాలని సూచించింది. వేతన పెంపుకు రూ.39,100 కోట్లు, అలవెన్స్లకు రూ.29,300 కోట్లు, పింఛన్ల రూపంలో రూ.33,700 కోట్లు కేటాయించారు. వీటిల్లో కేంద్ర బడ్జెట్ నుంచి రూ.73,650 కోట్లు, రైల్వేల నుంచి 28,450 కోట్లు రానున్నాయి.
ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీ ర్యాంకు ఉద్యోగులకు రూ.2,50,000 వేతనం లభించనుంది. దీంతోపాటు ప్రస్తుతం రూ.90,000 అందుకుంటున్న ఎంతోమంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఈ పెంపుతో ఎంపీల కంటే ఎక్కువ కానుంది. ఎంపీల వేతనం పెంపునూ పరిశీలిస్తోంది.