కశ్మీర్లో మరోసారి అలజడి.. పది కార్లు ధ్వంసం
రీనగర్ : నివురుగప్పినా నిప్పులా మారిన కశ్మీర్లో ఆందోళనకారులు రహదారులపైకి వస్తున్నారు. గత 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న సుందర కశ్మీర్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కశ్మీర్లో 40 వేలకు పైగా బలగాలను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నా .. ఇప్పటివరకు సడీ చప్పుడు చేయని ముష్కరులు మళ్లీ రాళ్లతో దాడికి దిగారు. అయితే వారిని భద్రతా సిబ్బంది ధీటుగా తిప్పికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
జమ్ముకశ్మీర్లో ఆందోళనకారులు మళ్లీ రహదారులమీదికొచ్చారు. రాళ్లతో దాడులకు దిగారు. దీంతో ఎనిమిది నుంచి పది కార్లు ధ్వంసమయ్యాయి. ఇలాంటి ఘటనే శ్రీనగర్లో కూడా ఒకటి జరిగింది. అయితే రెండురోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కన్సాల్ మాట్లాడుతూ .. ఆరు నుంచి ఏడు ఘటనలు జరిగాయి. కానీ ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత వాహనాలపై రాళ్ల దాడి జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికారులు మరింత అలర్టయ్యాయి. కశ్మీర్ లోయలో మరిన్ని భద్రతా బలగాలను మొహరించారు.
ఇటు సోమవారం శ్రీనగర్లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు శ్రీనగర్లో వరుసగా 15వ రోజు కూడా పాఠశాలు మూసివేశారు. తమ పిల్లలను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులు కొంచెం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపించమంటారా అని ఫరూక్ అహ్మద్ దర్ అనే తండ్రి మీడియాకు తెలిపారు. బారాముల్లా జిల్లాలో ఐదు పట్టణాల్లో పాఠశాలలను మాత్రం మూసివేసినట్టు అధికారులు పేర్కొన్నారు.