ఆ 8 మంది మలేషియన్లు.. ఢిల్లీ నుంచి ఎస్కేప్కి ప్లాన్.. చివరికిలా దొరికిపోయారు..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చాలా దేశాలు విదేశీ విమాన సర్వీసులను రద్దు చేసి లాక్ డౌన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాల్లో విదేశీయులు చిక్కుకుపోయారు. భారత్లోనూ అలా చిక్కుకుపోయిన విదేశీయులు ఉన్నారు. ప్రస్తుతం అత్యవసర సేవల్లో భాగంగా కొన్ని రిలీఫ్ ఫ్లైట్స్ను నడుపుతున్న నేపథ్యంలో విదేశీయులను కూడా వాటి ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయా దేశాలకు అందించాల్సిన సహాయ సామాగ్రితో పాటు విదేశీయులను తరలించారు. అయితే ఇదే విమానంలో 8 మంది మలేషియన్లు కూడా ఎక్కడంతో అధికారులకు అనుమానం వచ్చి వారిని కిందకు దించేశారు.
ఈ ఎనిమిది మంది ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిఘీ జమాత్లో పాల్గొన్నట్టుగా అనుమానిస్తున్నారు. జమాత్లో పాల్గొన్నవారిని పోలీసులు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తుండటంతో.. ఈ మంది వివిధ ప్రాంతాల్లో దాక్కుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆదివారం ఉదయాన్నే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి బయలుదేరి.. అందరూ విమానాశ్రయంలో కలుసుకున్నారని అధికారులు చెప్పారు. వీరిపై అనుమానంతో విమానం నుంచి కిందకు దించి ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. మరోవైపు గోవాలోని పనాజీలో చిక్కుకుపోయిన 150 మంది స్పెయిన్ వ్యక్తులను ఆదివారం ఉదయం గోవా ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి రిలీఫ్ ఫ్లైట్లో మాడ్రిడ్కు తరలించారు. విమానాశ్రయం వద్ద వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించామని.. సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన మత ప్రార్థనల్లో దాదాపు 2వేల పైచిలుకు మంది పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో పలు దేశాలకు చెందిన విదేశీయులు కూడా పాల్గొన్నారు. వీరిపై వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం విధించిన ఆంక్షలు,ఢిల్లీ పోలీసుల ఆదేశాలన సైతం లెక్క చేయకుండా మత ప్రార్థనలు నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఇక్కడ మత ప్రార్థనల్లో పాల్గొన్నవారే ఎక్కవగా ఉండటం గమనార్హం.