ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం
బెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు.
రెస్క్యూ సిబ్బంది పదిహేడు మందిని కాపాడింది. వీరంతా ఓ జాతరకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఉన్నతాధికారులు, నేవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతనిని ఆచూకీ గుర్తించేందుకు గోవా నుంచి డైవర్లు, హెలికాప్టర్లను దించారు.
ఈ పడవ ప్రమాదానికి గురైన సమయంలో కార్వార్ బీజేపీ నాయకురాలు, ఎమ్మెల్యే రూపాలీ నాయక్ మరో పడవలో ఉన్నారు. పడవ ప్రమాదంలో మునిగిన వారిని రక్షించాలని ఈమె వెంటనే తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె సిబ్బంది ఇద్దరిని కాపాడారు. ఆ తర్వాత నేవీ రంగంలోకి దిగింది.