కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, మంటల్లో 8 మంది సజీవ దహనం
మహారాష్ట్రలో గల ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఫల్గర్ జిల్లా బైసోర్లో ఉన్న ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. బైసోర్ ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పేలుడు జరిగిన ఫ్యాక్టరీకి సమీపంలో ఆంక్ ఫార్మా అనే కంపెనీ నిర్మాణం జరుగుతోంది. దీనిని మహారాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. కోల్వాడే గ్రామంలో నిర్మిస్తోంది.
శనివారం రాత్రి 7.20 గంటలకు రసాయనాలను పరీక్షించే సమయంలో పేలుడు జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో పేలుడు ప్రభావం ఎక్కువగా ఉంది. 15 కిలోమీటర్ల పరిధి ప్రాంతంలో పేలుడు ప్రభావం చూపించింది. ఫ్యాక్టరీ సమీపంలోని ఇళ్లలోని కిటికీలు పగిలిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు.
కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. గాయపడ్డవారిని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు సంబంధించి మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని, మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.