కేరళ పద్మనాభ ఆలయంలో భారీ చోరీ: కోట్ల విలువైన 8 వజ్రాలు మాయం
ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదతో పేరుగాంచిన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఒక విగ్రహానికి తిలక ధారణకు అలంకరించే అత్యంత విలువైన 8 పురాతన వజ్రాలు మాయమయ్యాయి.
తిరువనంతపురం: ప్రపంచంలోనే అత్యంత విలువైన సంపదతో పేరుగాంచిన కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఒక విగ్రహానికి తిలక ధారణకు అలంకరించే అత్యంత విలువైన 8 పురాతన వజ్రాలు మాయమయ్యాయి. వీటి ధర మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉండవచ్చని భావిస్తున్నారు.
సుప్రీం దృష్టికి వజ్రాల చోరీ
ఈ వజ్రాల చోరీ సంఘటనను న్యాయమిత్ర గోపాల్ సుబ్రహ్మణ్యం సోమవారం సుప్రీంకోర్టుకు, కేరళ పోలీసులకు తెలియజేశారు. కాగా, ఈ వజ్రాలు ఆలయంలో ప్రతీరోజూ జరిగే అనుష్ఠానానికి వినియోగిస్తారు.
చోరీ ఎప్పుడు జరిగింది?
ఈ విలువైన వజ్రాలు మాయమైనట్టు ఆలయ మాజీ కార్యనిర్వహణాధికారి కెఎన్ సతీష్ గుర్తించి రికార్డుల్లో నమోదు చేశారు. ఈ వజ్రాలు మాయమైన సంగతి... 2015 నాటి ఆలయ రికార్డులను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. కాగా, 2016 లో ఈ చోరీ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఆలయ కమిటీ నిర్లక్ష్యం
వజ్రాల గల్లంతు నేపధ్యంలో ఆలయ కమిటీ దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యం వహించింది. పైగా ఆ వజ్రాలు మాయం కాలేదని, వేరే చోటుకు తరలించామని అప్పుడు చెప్పుకొచ్చింది. కాగా 10 నెలల క్రితం ఆడిట్ నిర్వహించిన సందర్భంలో 189 కోట్ల రూపాయల విలువైన బంగారం మాయమైందని అధికారులు గుర్తించారు. దీనిపై కోర్టుకు వారు రిపోర్టు అందజేస్తూ.. ఆలయంలో 776 కిలోల బంగారం మాయమైందని తెలిపారు.
కిలోల కొద్ది బంగారం మాయమవుతోంది...
గోపాల్ సుబ్రహ్మణ్యం అందించిన నివేదిక ప్రకారం అనంత పద్మనాభస్వామి ఆలయం ఆస్తుల మొత్తం విలువ 1.5 లక్షల కోట్లు కావడం గమనార్హం. కాగా, ఈ వరుస చోరీలను గమనిస్తుంటే ఆలయంలో భద్రత ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతోంది. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి బాగుపడేట్లు లేదు.