మురుగు కాలువలో మొసలి హల్ చల్.. భయంతో పరుగులు తీసిన జనం..
చిప్లున్ : మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ మొసలి హల్ చల్ చేసింది. చిప్లూన్లో దాదర్ ప్రాంతంలో రోడ్డు పక్కన కాలువలో 8 అడుగుల మొసలి దర్శనమిచ్చింది. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దాన్ని రక్షించారు. సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో రత్నగిరిలోని వాశిష్టి నదిని వరదలు ముంచెత్తాయి. ఆ వరద ప్రవాహంలో సమీప అటవీ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన ముసలి చిప్లున్ పట్టణంలోని దాదర్ అనే ప్రాంతంలోకి ప్రవేశించింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో రోడ్డు పక్కనున్న కాలువలో మొసలి ప్రత్యక్షమైంది. అటుగా వెళ్తున్న జనం దాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు గంటల తరబడి కష్టపడి దాన్ని పట్టుకున్నారు.
ప్రముఖ టూరిస్టు స్పాట్ అయిన రత్నగిరిలో పలు సందర్శనీయ ప్రాంతాలున్నాయి. సావత్సాడ వాటర్ ఫాల్స్, పరశురామ దేవాలయానికి ఏడాదంతా పర్యాటకులు వస్తుంటారు. ఇదిలా ఉంటే రత్నగిరిలోని దాదర్ ప్రాంతంలో మురుగు కాలువలో మొసలి కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటన జరిగింది ముంబైలోని దాదర్ ప్రాంతంలో జరిగినట్లు ప్రచారం జరిగింది.