15 గంటలు.. 8 ఆస్పత్రులు.. చివరాఖరికి విషాదమే... భారత్లో గ్రౌండ్ రియాలిటీ...
కరోనా మెడికల్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందా... అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాము అన్ని విధాలా సిద్దంగా ఉన్నామని పైకి చెబుతున్నప్పటికీ.. గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఓవైపు కరోనా పేషెంట్ల తాకిడితో ఆస్పత్రులపై పెరుగుతున్న ఒత్తిడి.. మరోవైపు ఆస్పత్రులు,మెడికల్ వసతులను పెంచలేని దుస్థితి... వెరసి నిత్యం దేశంలో ఎంతోమంది బలైపోతున్నారు. ఉన్న ఆస్పత్రులను కోవిడ్ 19 ఆస్పత్రులుగా మార్చడం... ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా భయంతో సాధారణ పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ నిరాకరిస్తుండటంతో.. అలా కూడా ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా ఢిల్లీలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ..
ఆరోజు ఉదయం 5గంటలకు...
జూన్ 5, ఉదయం 5గంటల సమయంలో ఢిల్లీకి చెందిన నీలా కుమారి గౌతమ్ అనే గర్భిణి స్త్రీకి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె భర్త బిజేంద్ర సింగ్ ఓ రిక్షా మాట్లాడుకుని.. అందులో ఆమెను కూర్చోబెట్టుకుని నోయిడాలోని ESIC మోడల్ ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడ వైద్యులు వేరే ఆస్పత్రికి వెళ్లాలంటూ తిప్పి పంపించారు. అక్కడ ఉన్న ఆ కొద్ది క్షణాలు కూడా... ఓవైపు గౌతమ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే... మాస్కు తీసివేస్తే చెంప పగలగొడుతాను అంటూ వైద్యులు హెచ్చరించడంతో బిజేంద్ర సింగ్ షాక్ తిన్నాడు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని.. ఆక్సిజన్ పెట్టాలని ఎంత బతిమాలినా వారు వినిపించుకోలేదు.
అక్కడి నుంచి మరో ఆస్పత్రికి...
అక్కడి నుంచి మరో ఆస్పత్రికి వెళ్లగా... అక్కడ కూడా ఇదే సమాధానం ఎదురైంది. గౌతమ్ను ఐసీయూలో చేర్చాలని... ప్రస్తుతం తమ వద్ద ఐసీయూ ఖాళీ లేదని చెప్పి పంపించేశారు. అక్కడి నుంచి శివలిక్ ఆస్పత్రికి వెళ్లగా... నొప్పులకు అక్కడ కొద్దిపాటి చికిత్స అందించారు. అలాగే కొద్దిసేపు ఆక్సిజన్ కూడా పెట్టారు. అయితే ఆమెకు కరోనా వైరస్ ఉందేమోనన్న భయంతో.. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని బిజేంద్ర సింగ్కు సూచించారు. తమది చిన్న ఆస్పత్రి అని.. తాము చేయాల్సింది చేశామని అక్కడి వైద్యులు వెల్లడించడం గమనార్హం.
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే....
చేసేది లేక తిరిగి గౌతమ్ను రిక్షాలో పడుకోబెట్టుకుని బిజేంద్ర సింగ్ మరో ఆస్పత్రికి బయలుదేరాడు. అప్పటికే గౌతమ్కు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. బిజేంద్ర చేతిని ఆమె గట్టిగా పట్టుకుంది. దీంతో బిజేంద్రకు కూడా లోపల భయం మొదలైంది. మొత్తం మీద నాలుగో ఆస్పత్రి ఫోర్తిస్కు వెళ్లగా... 'ఆమె చనిపోయేలా ఉంది. నీ ఇష్టం వచ్చిన చోటుకు తీసుకెళ్లు. ఇక్కడ మాత్రం ఉంచకు.' అంటూ అక్కడి వైద్యులు కర్కషంగా మాట్లాడారు. కనీసం కొద్దిసేపు ఆమెకు వెంటిలేటర్పై ఆక్సిజన్ సపోర్ట్ అందించాలని బతిమాలినా పట్టించుకోలేదు.
ఎక్కడికెళ్లినా అదే సమాధానం...
అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. భార్య పరిస్థితి తీవ్రంగా ఉంది. బిజేంద్ర సింగ్కు ఏం చేయాలో తోచట్లేదు. దీంతో పోలీసులకు ఫోన్ చేసి సహాయం చేయాలని కోరాడు. దీంతో గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులతో మాట్లాడిన పోలీసులు.. గౌతమ్ను చేర్చుకోవాలని కోరారు. కానీ తీరా బిజేంద్రసింగ్ అక్కడికి వెళ్లాక... వైద్యులు అందుకు నిరాకరించారు. చేసేది లేక అక్కడి నుంచి సుమారు 12కి.మీ దూరంలో ఉన్న ఘజియాబాద్లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికీ మిట్ట మధ్యాహ్నం అయింది. దాదాపు 8 గంటలు గడిచిపోయింది. కానీ అక్కడ కూడా అదే సమాధానం. మా వద్ద బెడ్స్ లేవు.. చేర్చుకోలేము అని చెప్పేశారు.
చివరకు విషాదం...
గౌతమ్కు ఆశ సన్నగిల్లుతోంది. కళ్లు మూతలు పడుతున్నాయి. నన్ను కాపాడు అంటూ జీర గొంతుతో భర్తను వేడుకుంటోంది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లినా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. చివరకు రాత్రి 8.05గం. సమయంలో తిరిగి గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు వెళ్లారు. అంబులెన్సులో అక్కడికి చేరుకోగానే... వీల్ చైర్ తీసుకొచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె శరీరం చల్లబడిపోయింది. ముఖంలో ఎలాంటి చలనం లేదు. చివరకు వైద్యులు ఆమెను పరిశీలించి చనిపోయిందని నిర్దారించారు.
ఇదీ గ్రౌండ్ రియాలిటీ...
ఉదయం 5గం. నుంచి మొదలుపెడితే రాత్రి 8గం. వరకు 15 గంటలు నాన్స్టాప్గా 8 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా బిజేంద్ర సింగ్ తన భార్యను కాపాడుకోలేకపోయాడు. దీన్నిబట్టి భారత్లో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు కోవిడ్ 19 పేషెంట్లపై దృష్టి సారించి.. మిగతా పేషెంట్ల విషయాన్ని గాలికొదిలేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రులు మరీ దారుణం. కోవిడ్ 19 పరీక్షలు చేయకుండానే... వైరస్ సోకిందేమోనన్న భయంతో కనీసం ఆస్పత్రిలోకి కూడా రానివ్వట్లేదు. ఇటీవల హైదరాబాద్,కశ్మీర్లలోనూ ఇలాగే ఇద్దరు గర్బిణీ స్త్రీలు మృతి చెందారు. తాజా ఢిల్లీ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.