ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ/పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టక్కు. ఎస్యూవీ కారు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కతిహర్ జిల్లాలోని కర్సేలా సమీపంలో 31వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కతిహర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యుల బ్యాండ్ బృందం పూర్నియా నుంచి కారులో బయల్దేరింది. కుర్సేలా సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మరొకరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మరణించారు. మిగితా నలుగురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన టక్కును సీజ్ చేశారు.
ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతులను అర్జున్ మోచి(50) , కిశోర్ పాశ్వాన్(45), ధర్మేంద్ర కుమార్ మండల్(50), సుశీల్ కుమార్ మోచి(30), చోటేలాల్ రామ్(42)గా గుర్తించినట్లు చెప్పారు. వీరంతా మజ్దిహా గ్రామానికి చెందినవారీగా పోలీసులు తెలిపారు.